సాకారానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

సాకారానికి శ్రీకారం

Sep 21 2023 2:46 AM | Updated on Sep 21 2023 2:46 AM

పంప్‌హౌస్‌ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుగుతున్న దృశ్యాలు  - Sakshi

పంప్‌హౌస్‌ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుగుతున్న దృశ్యాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ప్రజల సుదీర్ఘ కల నెరవేరబోతోంది. వంశధార ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌, రబీ సీజన్‌లో రెండు పంటలకు నీరందించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనులు షురూ అయ్యాయి. వచ్చే రబీ కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. పనులు వడివడిగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 2.50 లక్షల ఎకరాలకు, ముఖ్యంగా శివారు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు ఉద్దేశించిన వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం కానుంది. సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ యూనిట్‌ నిర్మాణం జరుగుతోంది.

ఏళ్ల తరబడి నిరీక్షణ..

వంశధార ప్రాజెక్టు ఫేజ్‌–2లోని స్టేజ్‌ 2 పనుల కోసం ఇప్పటికే రూ.2,069 కోట్లు మేర ఖర్చు చేశారు. దాదాపు 92శాతం పనులు పూర్తయ్యాయి. ఒడిశా అభ్యంతరాల కారణంగా కీలకమైన నేరడి బ్యారేజీకు లైన్‌ క్లియర్‌ కాకపోవడంతో చేసిన ఖర్చుకు సార్థకత ఉండటం లేదు. హిరమండలం జలాశయం నిండితేనే జనాశయం నెరవేరుతుంది. అంత పెద్ద జలాశయం నిండాలంటే ఎగువన నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ, ఒడిశా నుంచి అడ్డంకులు కారణంగా నేరడి బ్యారేజీకి అడుగులు పడలేదు. దీంతో వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ వంశధార ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ఏళ్ల తరబడి నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. ఏం చేస్తే పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చో మార్గాన్ని అన్వేషించింది. గొట్టా బ్యారేజీ వద్ద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్‌కు పంపిస్తే వరద నీరు సముద్రం పాలుకాకుండా సంరక్షించవచ్చని భావించింది. దీనికోసం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు(ఎత్తిపోతల పథకం) నిర్మిస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకుంది. వెంటనే రూ.176.35కోట్లు మంజూరు చేసింది. పారదర్శకంగా టెండర్లు పిలిచింది. లోయస్ట్‌ కోట్‌ చేసిన కంపెనీకి టెండర్లు ఖరారు చేసింది. ఆ ప్రాజెక్టు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.

లిఫ్ట్‌తో పరిష్కారం..

జిల్లాలో అత్యధిక ఆయకట్టులో రెండు పంటలు పండాలంటే మండు వేసవిలో వంశధార కాలువ నిండుగా ప్రవహించాలి. హిరమండలంలోని వంశధార రిజర్వాయర్‌కు 19.5 టీఎంసీల నీరు వచ్చి చేరాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఖరీఫ్‌లోనే పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందడం లేదు. ఇక రబీ కోసమైతే చెప్పనక్కర్లేదు. 19.5 టీఎంసీల నీటిని తీసుకొస్తే మూడు పంటల సాకారం నెరవేరుతుంది. ప్రస్తుతం హిరమండలం రిజర్వాయర్‌లో డెడ్‌ స్టోరేజ్‌ కింద 2.5 టీఎంసీల నీరు ఉంటుంది. ప్లడ్‌ఫ్లో కెనాల్‌, కొండ చరియల నుంచి వచ్చే నీరు మరో 4 టీఎంసీలు ఉంటుంది. మిగిలినది నింపాలంటే ఒకటి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి నదిలో నీటిని మళ్లించడం, లేదంటే గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేయడమే మార్గం. అయితే, నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈ లోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేయాలంటే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ తప్పనిసరి అని భావించింది. ఆ ఆలోచనతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసింది.

ప్రతిపాదించిన పనులు..

గొట్టా బ్యారేజీ ఎగువన కోరాడ రెవెన్యూ గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి సుమారు 100 రోజుల కాలంలో 16 గంటల పాటు పంపింగ్‌తో 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరమండలం రిజర్వాయర్‌కు 12టీఎంసీలకు పైగా నీటిని లిఫ్ట్‌ చేయనున్నారు. దీనివల్ల ఖరీఫ్‌, రబీలో మొత్తం ఆయకట్టుకు నీరందించేలా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను డిజైన్‌ చేశారు. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ 2.4 కిలోమీటర్ల వద్ద పంప్‌ హౌస్‌, నాలుగు పంపుల ద్వారా ఎత్తిపోసేలా, 525 మీటర్ల పైపులైన్ల ద్వారా నీటిని పంపించేందుకు రూపకల్పన చేశారు. ఒక్కో పంపు సెకెన్‌కు 10క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో నాలుగు పంపుల ద్వారా సెకెనుకు 40 క్యూబిక్‌ మీటర్ల నీటిని 100రోజుల పాటు పంపిస్తే 12 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లోకి చేరుతుందని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను ప్రతిపాదించారు. నాలుగు ట్రాష్‌ ర్యాక్‌లు, నాలుగు స్టాప్‌లాగ్‌ గేట్లు, 31.00 మీటర్ల సంప్‌ ఫ్లోర్‌ లెవెల్‌, 38.113 మీటర్ల వాటర్‌ లెవెల్‌ పనులు, 40.000 మీటర్ల పంప్‌ ఫ్లోర్‌ లెవెల్‌ పనులు, 45.000 మీటర్ల మోటార్‌ ఫ్లోర్‌ లెవెల్‌, 69.00 మీటర్ల డెలీవరీ లెవల్‌ తదితర హైడ్రాలిక్‌ సిస్టమ్‌తో స్కీమ్‌ నిర్మాణం జరగనుంది.

ప్రారంభమైన వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు

రెండు సీజన్‌లు..రెండు పంటలకు మార్గం సుగమం

రూ.176.35కోట్ల వ్యయంతో స్కీమ్‌ రూపకల్పన

గొట్టా బ్యారేజీ ఎగువన కోరాడ వద్ద పనులు

రబీ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసేలా అడుగులు

నెరవేరనున్న జిల్లా రైతుల కల

చకచకా పనులు..

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి పంపు హౌస్‌, ప్రెజర్‌ మెయిన్‌, డెలవరీ సిస్టమ్‌, పైపులైను, పంపింగ్‌ మోటార్స్‌ పనులు చేపట్టాల్సి ఉంది. వాటిలో ఇప్పటికే పంప్‌ హౌస్‌, ప్రెజర్‌ మెయిన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. వేగంగా పనులు చేసే సమయంలో వర్షాల వల్ల అటంకం ఏర్పడింది. ప్రాధాన్యత క్రమంలో మిగతా పనులు చకచకా చేపట్టేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఒకవైపు ఎలక్ట్రిఫికేషన్‌, మరోవైపు లిఫ్ట్‌ పనులు వేగంగా చేసి జనవరి నాటికి కొలిక్కి తెచ్చేలా అడుగులు పడుతున్నాయి. ఇరిగేషన్‌ డీఈ రవికాంత్‌ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి.

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నమూనా 1
1/3

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నమూనా

మెటీరియల్‌ను దించుతూ..2
2/3

మెటీరియల్‌ను దించుతూ..

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement