కనగానపల్లి: కరువు మేఘాలు జిల్లాపై కమ్ముకుంటున్నాయి. పలు చోట్ల అప్పుడే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. కనగానపల్లి మండలంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీ–నీవా, పీఏబీఆర్ కాలువల ద్వారా చెరువులు, కుంటలకు సరిగా నీరు చేరలేదు. దీంతో మండలంలోని చాలా గ్రామాల్లో చెరువులు నీరు లేక బోసిపోయాయి. హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ లైనింగ్ వేయడంతో భూమిలోకి చుక్కనీరు ఇంకక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ బోరుబావులు ఎండిపోతున్నాయి. మండల వ్యాప్తంగా ఇప్పటికే 40 శాతం పైగా బోర్లు ఎండిపోయినట్లు సమాచారం.
పంటలను గొర్రెలకు వదిలేస్తున్న రైతులు..
బోరుబావుల నుంచి నీరందక సాగుచేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో ఎండిన పంటలను రైతులు గొర్రెలు, పశువులకు వదిలేస్తున్నారు. కనగానపల్లి మండలంలో హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్న పాతపాళ్యం గ్రామంలో సుబ్బిరెడ్డి అనే రైతు రబీ సీజన్లో బోరుబావి కింద ఆరు ఎకరాల్లో వేరుశనగ విత్తనాలు వేశాడు. పంట సాగు చేసిన కొన్నిరోజులకే బోరుబావిలో నీరు ఇంకిపోయాయి. పంటను కాపాడుకునేందుకు రూ.4 లక్షలతో మళ్లీ నాలుగు బోర్లు తవ్వించినా చుక్క నీరు పడలేదు. ఈ క్రమంలో సాగు చేసిన పంట ఎండిపోవడంతో గొర్రెలకు వదిలేశాడు. బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ లైనింగ్ చేయటమేనని రైతులు చెబుతుండడం గమనార్హం.
జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
బోరుబావుల్లో నీరు ఇంకి
నిలువునా ఎండుతున్న పంటలు
తీవ్ర ఆందోళనలో అన్నదాతలు


