
యథేచ్ఛగా జీరో దందా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జీరో బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీంతో ఏటా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండి పడుతోంది. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. ఇక్కడి నుంచి వెళ్లే, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చే సరుకుకు వే బిల్లులే ఉండటం లేదు. జీరో బిజినెస్ కారణంగా ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని అధికారుల అంచనా. జీఎస్టీ అధికారులకు ఇదంతా తెలిసే జరుగుతున్నా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.
రకరకాల మార్గాల్లో సరుకు..
ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఆదాయ సర్కిళ్లు అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు. అయితే, ఆయా ప్రాంతాలకు సరుకు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు షాపులకు చేరిపోతుందో అంతుచిక్కని పరిస్థితి. ముఖ్యంగా గ్రానైట్, టైల్స్, సిరామిక్ వంటి సరుకు జీఎస్టీ అధికారులకు తెలియకుండానే అర్ధరాత్రి చేరిపోతోంది. చెక్పోస్టుల్లో చెల్లించడం మినహా జీఎస్టీ చెల్లించిన దాఖలాలు లేవు.
ఎంత సరుకు ఉన్నా రూ.48 వేలే..
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు ప్రాంతాలకు రోజూ వందల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెళ్తుంటాయి.. వస్తుంటాయి. ఇందులో ప్యాసింజర్ల కంటే సరుకు రవాణా ఎక్కువ. సాధారణంగా సరుకు విలువ రూ.50 వేలు కంటే ఎక్కువ ఉంటే వే బిల్లు విధిగా ఉండాలి. ఉదాహరణకు 30 సెల్ఫోన్లు కొంటే రూ.3 లక్షలు. కానీ నాలుగు పేర్లమీద బిల్లు వేసి తెస్తారు. రూ. 5 లక్షల సరుకై నా రూ.49 వేల లోపు విలువ చూపించి ఇన్వాయిస్తో మాత్రమే సరిపెడుతున్నారు.
మార్కెట్లో బిల్లులు లేవు..
అనంతపురం, పుట్టపర్తి, హిందూపురం, కదిరి, తాడిపత్రి వంటి పట్టణాల్లో బిల్లులు లేని బిజినెస్సే ఎక్కువ. ఉదాహరణకు అనంతపురంలోని కమలానగర్లో ఏ ఒక్క షాపులోనూ కంప్యూటర్ జనరేటెడ్ బిల్లు ఉండదు. మొత్తం చేతిరాతతో ఉండే చిట్టీలపైనే బిల్లులు ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో జీరో దందా నడుస్తున్నా అడిగే నాథుడే లేరు. జీఎస్టీ అధికారులను అడిగితే.. తమకు రాష్ట్రస్థాయిలో అధికారులు ఆదేశిస్తేనే వారిపై దాడులు చేస్తామని, లేదంటే చేయలేమని చెబుతున్నారు.
నో... ‘వే’
రూ.50 వేలు దాటితే వే బిల్లు
ఉండాలనే నిబంధన బేఖాతరు
పది లక్షల సరుకై నా 48 వేలకే
చూపించి పన్ను ఎగవేత
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి