
వెంటాడిన మృత్యువు
పెనుకొండ రూరల్: బతుకు తెరువు కోసం కర్ణాటక నుంచి వలస వచ్చిన వ్యక్తిని ప్రమాదం రూపంలో వెంటాడి మృత్యువు కబళించింది. స్థానికులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఫకృద్దీన్ (36), ఫర్హానా దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం బతుకు తెరువు కోసం పెనుకొండకు వలస వచ్చాడు. పంచర్ షాఫును నిర్వహిస్తు కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం దుద్దేబండ మలుపు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన పంచర్ షాపును ఏర్పాటు చేసుకున్నాడు. రోజు లాగే గురువారం పంచర్ షాపును తెరిచి తన పనిలో నిమగ్నమైన సమయంలో ఊహించని రీతిలో మృత్యువు వెంటాడింది. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొని నేరుగా పంచర్ షాపు వైపుగా దూసుకెళ్లింది. షాపు ముందు పని చేసుకుంటున్న ఫకృద్దీన్పై బోల్తాపడింది. ఘటనలో ఫకృద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు ముస్తాక్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న కియా పీఎస్ ఎస్ఐ రాజేష్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
నీటి కుంటలో పడి
వృద్ధురాలి మృతి
పరిగి: మండలంలోని శీగిపల్లికి చెందిన గంగమ్మ(74) నీటి కుంటలో పడి మృతి చెందింది. కుమారుడు హనుమంతరాయప్ప కుటుంబంతో కలిసి నివాసముంటున్న ఆమె గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమీపంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. హనుమంతరాయప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి ఆత్మహత్య
ధర్మవరం: స్థానిక మారుతీనగర్కు చెందిన మంచిరెడ్డి రామ్మోహన్రెడ్డి(45) గురువారం సాయంత్రం పోతుకుంట వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లమాడ పంచాయతీరాజ్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతి కింద కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయనకు భార్య మాధవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై హిందూపురం రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థి అదృశ్యం
కొత్తచెరువు: మండలంలోని నారేపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రశాంత్ కుమార్ కనిపించడం లేదని తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కొత్తచెరువు పీఎస్ సీఐ మారుతీ శంకర్ తెలిపారు. వివరాలు... పల్నాడు జిల్లా మాచర్లలో బీటెక్ చదువుతున్న ప్రశాంత్కుమార్.. కొన్ని రోజులు క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 19న కళాశాలకు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే కళాశాలకు ప్రశాంత్ చేరుకోలేదని తెలుసుకున్న కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నలుగురు విద్యార్థుల అదృశ్యం
అనంతపురం: నగరంలోని మూడో రోడ్డులో ఉన్న బీసీ బాలుర హాస్టల్–2లో ఉంటూ ఒకటో రోడ్డులో ఉన్న పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరిలో పదో తరగతి చదువుతున్న నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామానికి చెందిన బాబు, కూడేరు మండలం అరవకూరు గ్రామానికి చెందిన జి.నవదీప్, 8వ తరగతి చదువుతున్న గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఎస్.మణికంఠ, తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీసత్యసాయి జిల్లా తోటమాకులపల్లి గ్రామానికి చెందిన కె.మణికంఠ ఉన్నారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంత పాటు.. పాఠ్యాంశాలల్లో వెనుకబడి ఉండడంతో గురువారం హెచ్ఎం శ్రీదేవి మందలించారు. దీంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులు ఆ తర్వాత హాస్టల్కు కూడా చేరలేదు. గమనించిన వార్డెన్ మస్తాన్ వెంటనే అప్రమత్తమై పాఠశాలలో ఆరా తీశాడు. మధ్యాహ్నం నుంచి వారు తరగతులకు హాజరు కాలేదని తెలుసుకుని వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాత్రి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు సీఐ కె.శాంతిలాల్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94906 18679కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
కనిపించకుండా పోయిన విద్యార్థులు

వెంటాడిన మృత్యువు

వెంటాడిన మృత్యువు

వెంటాడిన మృత్యువు