
దళిత ద్రోహి ఎంఎస్ రాజు
● దళిత బిడ్డకు న్యాయం చేయలేని అసమర్థుడు
● వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
సాకే చంద్ర ధ్వజం
అనంతపురం కార్పొరేషన్: ‘శ్రీసత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత మైనర్ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని నువ్వు నిజంగా దళిత ద్రోహివే’ అంటూ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను సన్యాసులంటూ మాట్లాడుతావా? అంటూ మండిపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని బాధితురాలికి అండగా నిలవాలని హితవు పలికారు. మైనర్ బాలిక కేసులో 14 మందిని అరెస్ట్ చేసినంత మాత్రనా.. న్యాయం చేసినట్లు కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగరంలోని అశోక్నగర్లో ఓ దళిత యువతి హత్యకు గురైతే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి యువతి కుటుంబంలో ఒకరి ఉద్యోగంతో పాటు, ఐదెకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో మృతురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం అందజేసిందన్నారు. ఆ సమయంలో ఉనికి కోసం ఓవరాక్షన్ చేసిన టీడీపీ నాయకులు.. నేడు ఓ దళిత మైనర్ బాలికకు, మరో గిరిజన యువతికి అన్యాయం జరిగినా కనీసం నోరు కూడా మెదపడం లేదన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎవరెన్ని కేసులు పెట్టినా, అరెస్ట్లు చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, ఎస్సీ సెల్ శింగనమల నియోజకవర్గ అధ్యక్షుడు అంజి, పార్టీ నగర కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.