
పచ్చిరొట్టతో నేల సారవంతం
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: పచ్చిరొట్ట ఎరువు వాడకంతో నేల సారవంతం అవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. పచ్చిరొట్ట పైర్ల వినియోగంపై వ్యవసాయ శాఖ రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఉద్యాన శాఖ డీడీ చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందించాలి
● జిల్లా విద్యాశాఖాధికారి క్రిష్టప్ప
మడకశిర: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి క్రిష్టప్ప సూచించారు. సోమవారం మడకశిరలోని బాలికోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు పంపిణీ చేసిన కిట్లను పరిశీలించారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆ దిశగా విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
రికార్డు అసిస్టెంట్కు నివాళి..
విద్యాశాఖలో రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్న అక్కంపల్లి గొట్టహట్టి గ్రామానికి చెందిన చిత్ర లింగప్ప సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకుని డీఈఓ క్రిష్టప్ప ఆ గ్రామానికి చేరుకుని చిత్రలింగప్ప మృతదేహానికి నివాళులర్పించారు. స్థానిక ఎంఈఓలు భాస్కర్, నరసింహమూర్తి ఆయన వెంట ఉన్నారు.
జల్సాలకు అలవాటు పడి బైకుల చోరీ
అనంతపురం: జల్సాలకు అలవాటు పడి బైకులను చోరీ చేస్తున్న నలుగురు మైనర్లతో పాటు ముగ్గురిని అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం టూటౌన్ పోలీసుస్టేషన్లో అనంతపురం అర్బన్ డీఎస్పీ వి. శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు... ఆకుతోటపల్లికి చెందిన బైనేని యతీంద్ర అలియాస్ శివా, బోగిశెట్టి యోగీశ్వర్ అలియాస్ యోగి, అనంతపురంలోని గంగానగర్కు చెందిన సి. యశ్వంత్ కుమార్ అలియాస్ బన్నీ జల్సాలకు అలవాటు పడ్డారు. మరో నలుగురు మైనర్లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి బైకులను చోరీ చేయడం ప్రారంభించారు. శనివారం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ వైపు నుంచి లగేజీ ఆటోలో ఈ ఏడుగురు అనుమానాస్పదంగా వెళ్తుండడం చూసిన కొందరు.. సమాచారం ఇవ్వడంతో టూ టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రుష్యేంద్ర బాబు, సిబ్బందితో అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే బాగోతం బయటపడింది. అనంతపురం నగరంతో పాటు ధర్మవరం, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో రెండేళ్లుగా బైక్లను చోరీ చేస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. వారి నుంచి 19 బైక్లు, ఒక లగేజీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బైనేని యతేంద్ర అలియాస్ శివా ముఠాలో ముఖ్యుడని, ఇతనిపై ఇది వరకే 8 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
అలరించిన నృత్య రూపకం
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలకు చెందిన బాలవికాస్ చిన్నారులు సోమవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత నృత్య రూపకం నిర్వహించారు. అబుదాబి, దుబాయ్, ఓమన్, కువైట్, ఖతార్ దేశాలకు చెందిన చిన్నారులు పాల్గొన్నారు.

పచ్చిరొట్టతో నేల సారవంతం

పచ్చిరొట్టతో నేల సారవంతం