
పెనుకొండ రూరల్: ప్రజాస్వామ్యంలో దాడులు సరైన చర్య కాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ నేతల దాడులు, కూటమి ప్రభుత్వం సూచనలతో జరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ను ఆమె ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘సాక్షి’ టీవీ డిబేట్లో ఓ వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగానే.. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేశారన్నారు. చర్చలో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను అన్యాయంగా ‘సాక్షి’కి ఆపాదించి కార్యాలయాలపై కూటమి నేతలు దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలన్నారు. ‘సాక్షి’లో జరిగిన చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అతని వ్యక్తిగతమన్నారు.
అయినప్పటికీ అందుకు బాధ్యుడిని చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం అక్రమమన్నారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు.