
జగరాజుపల్లిలోని మోడల్ స్కూల్
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఇప్పటికీ పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు
అసంపూర్తిగా తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణాలు
పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరని ‘విద్యామిత్ర కిట్లు’
యూనిఫాం, బూట్లు, సాక్సులు, పెండింగ్
ప్రైవేటు ఫీజుల మోతతో అల్లాడిపోతున్న తల్లిదండ్రులు
కూటమి సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు
పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మోడల్ స్కూల్ ఇది. 300 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కనీస సౌకర్యాలు కరువు కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవుల్లోనే వివిధ పనులు చేపట్టాల్సి ఉన్నా.. కూటమి సర్కార్ దృష్టి సారించలేదు. ఫలితంగా విద్యార్థులు మరో సంవత్సరం సమస్యలతో సహవాసం చేస్తూ చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
పుట్టపర్తి/హిందూపురం టౌన్: వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరం తొలిరోజే సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ‘విద్యామిత్ర’ కిట్లు నేటికీ పాఠశాలలు చేరకపోవడం..ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను నేటికీ పూర్తికాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చినా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇలా ఉండగా... ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల మోత మోగుతోంది.
లక్ష మందికిపైగా విద్యార్థులు..
జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద 2012 పాఠశాలలుండగా.. 1 నుంచి 10వ తరగతి వరకూ 1,01,907 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ అందించేందుకు పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్టూడెంట్ కిట్స్ (విద్యామిత్ర కిట్లు) స్కూల్ పాయింట్కు చేరుస్తామని కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించినా..ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. నేటికీ జిల్లాలోని చాలా స్కూళ్లకు యూనిఫాం, బ్యాగులు, షూ చేరలేదు. దీంతో తొలిరోజు కిట్లు కాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, డిక్షనరీలు మాత్రమే విద్యార్థులకు సరఫరా చేయాలని విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలోని కొన్ని పాఠశాలలకు పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ జగన్ హయాంలో వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలు, జగనన్న కిట్లు..తదితర విద్యాసామగ్రి పాఠశాలలకు చేరేవని చెబుతున్నారు.
పూర్తికాని టీచర్ల బదిలీల ప్రక్రియ..
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తిచేసి పునఃప్రారంభం నాటికి కొత్త స్కూళ్లల్లో చేరేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా.. పూర్తి కాలేదు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలయినా ఎస్జీటీల ప్రక్రియ కొనసాగుతోంది. బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు కొత్త స్కూళ్లకు వెళ్లాలి. అయితే వారి పాత స్థానంలోకి ఎవరూ రాకపోతే అలాంటి వారు వెనక్కురావాలి. ఈ స్థానంలోకి మరొకరు వచ్చేదాకా అక్కడే కొనసాగాలి.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల మోత..
జిల్లాలో 650 వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల నిర్వాహకులు టెక్నో, ఈ–టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్... ఇలా వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో తరగతిని బట్టి రూ.20 వేల నుంచి రూ.80 వేల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇతర ఖర్చులు కలుపుకుంటే ఒక్కో విద్యార్థిపై అక్షరాల లక్షపైనే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ పాఠశాలలో చెప్పే సిలబస్కు సంబంధించిన పుస్తకాలు బయట ఎక్కడా దొరకవని, వీటితో పాటు నోటు పుస్తకాలు సైతం పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధన విధించారు. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు అక్కడే పుస్తకాలు కొంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజుల నియంత్రణ ఉండేది. ఇక డోనేషన్లు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఇవేవీ అమలు కావడం లేదు. దీనిపై విద్యాశాఖాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సౌకర్యాలు కరువు..
వేసవి సెలవులు ప్రారంభం కాగానే పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి సౌకర్యాలన్నీ కల్పిస్తారు. గత ఐదేళ్లూ ఇదే పద్ధతిలోనే పనులు సాగాయి. కానీ ప్రస్తుత కూటమి సర్కార్ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించింది. కనీసం గత ప్రభుత్వ హయాంలో ‘నాడు–నేడు’ కింద చేపట్టిన భవనాలు, టాయిలెట్స్, ఇతరత్రా నిర్మాణాలు సైతం పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదిలోనే 4 వేల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు బాట పట్టారు. ఇక ఈ సంవత్సరం ఎంత మంది ప్రభుత్వ స్కూళ్లను వీడుతారో త్వరలోనే తెలియనుంది.
ప్రైవేటు దోపిడీ పెరిగింది
కూటమి ప్రభుత్వంలో ఫీజులపై నియంత్రణ లేదు. అందుకే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల నిర్వాహకులు ఇష్టానుసారం పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కూడా లేని స్కూళ్లలోనే ఎల్కేజీకే రూ.30 వేలు పిండుకుంటున్నారు. పాఠశాలల ఆవరణలోనే పుస్తకాలు, విద్యా సామగ్రి విక్రయిస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులకు పట్టడం లేదు.
– బాబావలి, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్యూ
వసతులు కల్పించాలి
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో వసతులు లేవు. ఇలా అయితే మాలాంటి వాళ్లు పిల్లల్ని ఎక్కడ చదివించాలి. నా కుమారుడిని ప్రైవేట్ స్కూల్లో చదివించలేక ప్రభుత్వ బడిలో 4వ తరగతిలో చేర్చాను. గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా పాఠశాలలపై దృష్టి సారించి అన్ని పాఠశాలల్లో వసతులు మెరుగుపరిస్తే బాగుంటుంది.
– శ్రీ చందన, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం

మోడల్ స్కూల్ ఆవరణలో నిలిచిన మురుగునీరు

జగరాజుపల్లిలోని మోడల్ స్కూల్ భవనం దుస్థితి