
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: సున్నితమైన విషయాలను పెద్దవి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రత్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకొంటున్న సున్నితమైన విషయాలను రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి కుటుంబాలను మరింత బాధ పెడుతున్నాయన్నారు. ఇటీవల కాలంలో రామగిరి మండలంలో జరిగిన ఘటనపై బాధితుల పరామర్శ పేరుతో పోలీసులు అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు చట్టం ఉందని, బాలిక సంఘటన విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు ఆందోళన ద్వారా బాధితుల వివరాలు బహిర్గతమై వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు. బాధితులు హక్కులను భంగం కలిగించకుండా వ్యవహరించాలని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలకు సూచించారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.
పట్టు గూళ్ల విక్రయ కేంద్రం నూతన భవన నిర్మాణం
● కేంద్ర వాటా రూ.4 కోట్ల మంజూరు
హిందూపురం: పట్టణంలోని ఏపీ పట్టుగూళ్ల విక్రయ కేంద్రం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం రూ.8 కోట్లు ఖర్చు కానుండగా కేంద్రం వాటా రూ.4 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్ర నిధులు ఇంకా విడుదల కాలేదు. కాగా కొత్త పట్టుగూళ్ల విక్రయ కేంద్రం భవన నిర్మాణానికి అర్అండ్బీ అధికారులు డీఈ వెంకటరామిరెడ్డి, ఏఈ మోహన్బాబు సిబ్బంది కొలతలు, మార్కింగ్ వేశారు. త్వరలోనే కేంద్ర నిధులతో పనులు ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత విక్రయ కేంద్రం ముందుభాగంలో ఉన్న భవనంలోకి ప్రస్తుత కార్యాలయాన్ని మార్చాడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
పట్టుగూళ్ల కేంద్రం అధికారి బదిలీ..
హిందూపురం పట్టుగూళ్ల విక్రయ కేంద్రం నిర్వాహణ అధికారి లక్ష్మిరెడ్డిని బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కడప విక్రయ కేంద్రానికి బదిలీ అయ్యారు. హిందూపురం విక్రయ కేంద్రం అధికారిగా కుప్పం నుంచి హంపయ్యను నియమించారు. రెండురోజుల్లో బదిలీలైన అధికారులు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాఽధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బుక్కపట్నంలో
ఏటీఎస్ సేవలు ప్రారంభం
పుట్టపర్తి టౌన్: రవాణాశాఖ సేవలు సులభతరం చేయడమే లక్ష్యంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) మంజూరుకై బుక్కపట్నంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను ప్రారంభించినట్లు జిల్లా రవాణాఖ అధికారి కరుణసాగర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12 నుంచి ఏటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి వాహనదారుడు వాహన ఫిట్నెస్ పరీక్ష నిమిత్తం దగ్గరలో ఉన్న ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్కు వెళ్లాలన్నారు. గతంలో హిందూపురం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి ఎఫ్సీ చేసుకొనేవారని, అలా కాకుండా సేవలను సులభతరం చేసేందుకు బుక్కపట్నంలో ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అట్రాసిటీ కేసు నమోదు
నల్లమాడ: మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ హనుమంతరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై దాడిచేసి కులం పేరుతో దూషించాడంటూ దళిత యువకుడు కిషోర్ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం గురువారం అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు