
టీచర్ల సహనానికి కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ ఉన్నతాధికారులు మళ్లీ టీచర్ల సహనానికి పరీక్ష పెట్టారు. పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ తొలిరోజు మంగళ వారం రసాభాస నడుమ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సాంకేతిక సమస్యలతో అర్ధరాత్రి తర్వాత వాయిదా పడింది.
ఉదయం 11 గంటలకు అని చెప్పి...
బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని,జాబితాలోని 1 నుంచి 500 సంఖ్య వరకు హాజరుకావాలంటూ ఉదయాన్నే ఉపాధ్యాయులకు మెసేజ్లు పంపారు. కానీ సాయంత్రం 4 గంటలకు 1 నుంచి 350 సంఖ్య వరకు రావాలంటూ మెసేజ్లు పెట్టారు. ఎట్టకేలకు 4.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ముఖ్యంగా సీనియార్టీ జాబితాలో అవకతవకలు, స్టేషన్ పాయింట్ల నమోదులో అక్రమాలు, ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అర్హులు తదితర సమస్యలపై విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ స్పష్టం చేశారు.
వెబ్ ఆప్షన్ల బహిష్కరణ..
భాషా పండితుల (ఎల్పీ) బదిలీల్లో భాగంగా బుధవారం రాత్రి ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల చేశారు. అయితే, ఫిర్యాదులు స్వీకరించ కుండానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై భాషా పండితులు ప్రక్రియను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
నేడు కౌన్సెలింగ్ ఇలా...
క్రమ సంఖ్య 351 నుంచి 700 వరకు ఉన్న ఎస్జీటీలకు గురువారం ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, క్రమ సంఖ్య 701 నుంచి 1,000 వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని అనంతపురం డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు
గుంతలో పడి టీచర్కు గాయాలు
బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ టీచర్ పి. రామిరెడ్డి, బుక్కపట్నంలో ఎస్జీటీగా పని చేస్తున్న సుధారాణి దంపతులు. భార్య కౌన్సెలింగ్ నేపథ్యంలో రామిరెడ్డి బుధవారం పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్కు వచ్చారు. రాత్రి భోజనం కోసమని కేంద్రం నుంచి బయటకు వెళ్తూ చీకట్లో ప్రమాదవశాత్తు గుంతలో పడ్డారు. చేతికి తీవ్ర గాయాలు కాగా,తోటి టీచర్లు ఆయన్ను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
నేడు పేరూరుకు
వైఎస్సార్ సీపీ నాయకులు
● అత్యాచారానికి గురైన దళిత బాలిక
కుటుంబానికి పరామర్శ
రామగిరి: కీచకుల దుర్మార్గానికి బలైపోయిన దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మండలంలోని పేరూరుకు వస్తున్నారు. ఈ మేరకు బుధవారం పార్టీ జిల్లా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తండ్రి చనిపోగా.. మతిస్థిమితం సరిగాలేని తల్లి పంచన ఉంటున్న అమాయక దళిత బాలికపై 14 మంది దుర్మార్గులు నెలల తరబడి అత్యాచారం చేయగా బాలిక గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఈ అకృత్యాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాలిక కుటుంబానికి ధైర్యం చెప్పి పరామర్శించేందుకు మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఉషశ్రీ చరణ్, సాకే శైలజానాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం పేరూరు విచ్చేస్తున్నారు. తొలుత పేరూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది.