
గాలీవాన బీభత్సం.. వృద్ధుడి మృతి
రామగిరి: పేరూరు పంచాయతీ కురుగుండ్లకాలనీలో మంగళవారం రాత్రి గాలీవాన బీభత్సం చేసింది. వర్షంతోపాటు బలమైనగాలులు వీయడంతో గొర్రెలమంద వద్ద మంచంపై నిద్రిస్తున్న అశ్వర్థప్ప (70) సుమారు 10 అడుగుల దూరం ఎగిరి పడి మృతి చెందాడు. రెండు ఇళ్లు నేలమట్టంకాగా, పలు ఇళ్లపైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. గాలివేగం అంతకంతకూ పెరగడంతో 35కుపైగా విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. పదుల సంఖ్యలో భారీ చెట్లు కూలిపోయాయి. మృతుడు అశ్వర్థప్ప స్వగ్రామం పరిగి మండలం చిన్నంపల్లి కాగా, విషయం తెలుసుకున్న కుటుంబీకులు రాత్రే మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
19 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 19 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా లేపాక్షి మండలంలో 38.4 మి.మీ, చిలమత్తూరు 32.8, గోరంట్ల మండలంలో 32.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఇక హిందూపురం మండలంలో 26.4 మి.మీ, పరిగి 22.6, రొద్దం మండలంలో 21.6 వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. మిగతా మండలాల్లోనూ 11 నుంటి 1.2 మి.మీ మధ్య వర్షపాతం నమోదైందనట్లు వెల్లడించారు. మరో రెండు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రామగిరి మండలం
పేరూరు కురుగుండ్లకాలనీలో ఘటన
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

గాలీవాన బీభత్సం.. వృద్ధుడి మృతి