
హత్యలు.. అత్యాచారాలు.. కబ్జాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భూకబ్జాలు, ఆక్రమణలు, హత్యలు, అత్యాచారాలకు కూటమి సర్కారు కేరాఫ్గా మారింది. ‘కూటమి’ పాలనా పగ్గాలు చేపట్టి గురువారానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు భారీ వైఫల్యాలను మూటగట్టుకుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్న భావన అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు, కళాశాలలకు తమ పిల్లలను పంపాలంటేనే బాలికల తల్లిదండ్రులు భయపడుతున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండడంతో సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా మారింది.
చెరపట్టిన మైనింగ్ మాఫియా
హిందూపురం మొదలు తాడిపత్రి వరకూ అన్ని నదులనూ, వంకలనూ టీడీపీ నేతలు చెరపట్టారు. చిత్రావతి, హగరి నదులు ఇప్పటికే రూపు మారిపోయాయి. ఇక కొండలు, గుట్టలు ఏడాదిలోనే మాయమయ్యాయి. మైనింగ్, రెవెన్యూ శాఖలు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఎప్పుడో మానేశాయి.
సూపర్ సిక్స్ మోసం..
‘ఆరు పథకాలు మీ జీవితాలనే మారుస్తాయంటూ’ ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలారు. ‘అమ్మఒడి’ లేదు, ‘ఉచిత గ్యాస్ సిలిండర్లు’ లేవు, రైతు సాయం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. ఒక్కటంటే ఒక్క పథకమూ లేదు.
పేట్రేగుతున్న రౌడీషీటర్లు
అధికార అండతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యుల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే కంచె వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కలుగుల్లో దాక్కున్న రౌడీషీటర్లందరూ చంద్రబాబు సర్కారు పుణ్యమా అని నేడు దర్జాగా తిరుగుతూ రెచ్చిపోతున్నారు.
ఏడాదిలో నాలుగు హత్యలు
ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు హత్యలు జరిగాయి. వీటన్నింటి వెనుకా టీడీపీ వర్గీయులే ఉండటం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే హిందూపురంలో మల్లికార్జున దారుణ హత్యకు గురయ్యారు. పాపిరెడ్డిపల్లెలో లింగమయ్యపై టీడీపీ నాయకులు దాడి చేసి చంపేశారు. రాప్తాడు మండలంలో దంపతులు ముత్యాలమ్మ, నారాయణరెడ్డిని పట్టపగలే నరికి హత్య చేశారు.
మహిళల్లో ఆందోళన..
రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికను 14 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతేకాదు ఇంటర్ విద్యార్థిని తన్మయిని అతి కిరాతకంగా చంపి పొలాల్లో పడేసిన ఘటన జిల్లా ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. తాడిపత్రిలో ఐచర్ వాహనంలో ఓ బాలిక, పుట్లూరు మండలంలో మరో బాలిక అత్యాచారానికి గురయ్యారు.
మద్యం ఏరులు..
గతంలో ప్రభుత్వ పర్యవేక్షణలోనే మద్యం విక్రయాలు జరిగేవి. అప్పట్లో బహిరంగ మద్యంపై ఉక్కుపాదం మోపారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులకు వేళాపాళా లేకుండా పోయింది. బెల్టుషాపులు, పర్మిట్రూములతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంటుండటంతో పల్లెలు మత్తులో జోగుతున్నాయి.
కరెంటు బిల్లులతో లబోదిబో..
అధికారంలోకి వస్తే ఒక్కపైసా కరెంటు చార్జీ పెంచబోనని చెప్పిన చంద్రబాబు.. కరెంటు చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచారు. రూ.800 బిల్లు వచ్చే మధ్యతరగతి కుటుంబానికి ఇప్పుడు రూ.1,500 వస్తోంది. కరెంటు చార్జీల పెంపుతో జనం అల్లాడిపోతున్నారు.
కూటమి పాలనకు ఏడాది
దారుణాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి అనంతపురం జిల్లా
దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాలికపై సామూహిక అత్యాచార ఘటన
భయభ్రాంతులకు గురి చేసిన గిరిజన యువతి దారుణ హత్య