బది‘లీలలు’ ఇంతింత కాదయా! | - | Sakshi
Sakshi News home page

బది‘లీలలు’ ఇంతింత కాదయా!

Jun 11 2025 7:51 AM | Updated on Jun 11 2025 7:51 AM

బది‘లీలలు’ ఇంతింత కాదయా!

బది‘లీలలు’ ఇంతింత కాదయా!

అనంతపురం అగ్రికల్చర్‌: వ్యవసాయ, అనుబంధ శాఖల్లో బదిలీల పర్వం ఇష్టారాజ్యంగా జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనవంతులు, బలవంతులు పైచేయి సాధించి కోరుకున్న చోట పోస్టింగ్‌ సాధించినట్లు తెలిసింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పాడి, మతద్యి, మార్కెటింగ్‌శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలు జరిగాయి. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే చాలా మంది ఉద్యోగులు బదిలీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిఽధుల పలుకుబడి, వారి సిఫారసులు, అలాగే పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆ పోస్టులకు రూ.లక్షల్లోనే బేరం..

వ్యవసాయ శాఖలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక డిప్యూడీ డైరెక్టర్‌ శివప్రసాద్‌ బదిలీ అయ్యారు. 9 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు (ఏడీఏ), దాదాపు 57 మంది అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ (ఏఓ)కు బదిలీ ఉత్తర్వులు అందాయి. అయితే ఇందులో అనంతపురం ఏడీఏ, రూరల్‌ ఏఓతో పాటు మరో నాలుగు స్థానాలకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆ శాఖలో ప్రచారం సాగుతోంది. ఏడీఏ పోస్టుకు రూ.20 లక్షలు, ఏఓ పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు, మరో ఐదారు పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బేరసారాలు జరిగాయనే ప్రచారం సాగుతోంది. ఇందులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి నేతలు, కొందరు అగ్రీ ఇన్‌పుట్‌ డీలర్లు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన ఆప్షన్లు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో సంబంధం లేకుండా అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ అంటూ అడ్డదిడ్డంగా బదిలీలు చేసినట్లు చెబుతున్నారు. కాగా వ్యవసాయశాఖ ఏఓ బదిలీ జాబితాలు ఆపేయాలని మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వచ్చినట్లు చెబుతున్నారు.

అంతా గందరగోళం..

పశుసంవర్ధకశాఖలో బదిలీ ఉత్తర్వులు వెలువరించి.. ఆ తర్వాత తక్షణమే వెనక్కి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. జాబితాలు వెల్లడించొద్దని డైరెక్టరేట్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే మత్స్యశాఖ పరిధిలో రెండు ఎఫ్‌డీఓ పోస్టుల విషయం కూడా తేల్చలేదు. పట్టు పరిశ్రమ శాఖ రెండు జిల్లాల అధికారులకు బదిలీ ఉత్తర్వులు అందాయి. అనంతపురంలో పనిచేస్తున్న డి.ఆంజనేయులు కర్నూలుకు, కర్నూలులో పనిచేస్తున్న విజయకుమార్‌ అనంతపురానికి బదిలీ అయ్యారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా జేడీ పద్మమ్మ చిత్తూరుకు, అక్కడ పనిచేస్తున్న శోభారాణి శ్రీ సత్యసాయి జిల్లాకు బదిలీ అయ్యారు. పట్టు పరిశ్రమల శాఖలో కొందరు సెరికల్చర్‌ అధికారులు (ఎస్‌ఓ) బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది అధికారులు మంగళవారమే ఇక్కడి నుంచి రిలీవ్‌ అయ్యారు. ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డిని కొనసాగించారు. ఏపీడీగా ఉన్న ఫిరోజ్‌ఖాన్‌ను కర్నూలు ఏపీఎంఐపీడీ ఏపీడీగా బదిలీ చేశారు. శ్రీశైలంలో పనిచేస్తున్న ధనుంజయను ఇక్కడ ఏపీఎంఐపీ ఏపీడీగా బదిలీ చేశారు. ఇక్కడ హెచ్‌ఓగా ఉన్న పల్లవికి ఏడీగా పదోన్నతి కల్పించి కుప్పం ఏడీగా బదిలీ చేశారు. ఉద్యానశాఖ ఏడీ నరసింహారావును నెల్లూరుకు బదిలీ చేసి ఆయన స్థానంలో దేవానంద్‌ను ఇక్కడకు పంపారు. అలాగే నలుగురు హెచ్‌ఓలకు బదిలీ ఉత్తర్వులు అందాయి. గుంటూరుకు బదిలీ అయిన మార్కెటింగ్‌శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి ఇక్కడి నుంచి రిలీవ్‌ అయ్యారు. అలాగే వ్యవసాయ, ఉద్యానశాఖలో పలువురు అధికారులు మంగళవారం రిలీవ్‌ అయ్యారు.

వ్యవసాయ, అనుబంధ శాఖల్లో

ఇష్టారాజ్యం

బలవంతులు, ధనవంతులు కోరుకున్న చోట పోస్టింగ్‌

ఏఓ జాబితాలు ఆపేయాలని ఉత్తర్వులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement