
చదువుతోనే ఉజ్వల భవిత
పుట్టపర్తి: చదువుతోనే ఉజ్వల భవిత సాధ్యమని, విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన 225 మంది పది, ఇంటర్ విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్స్’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సోమవారం కొత్తచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్ టీఎస్ చేతన్, డీఈఓ కృష్ణప్ప తదితరులు విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు, మెమొంటోలు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించిన రూ.20 వేల ఆర్థిక సాయం వారి ఉన్నత చదువులకు కొంతమేర ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు. డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం డీఈఓ కృష్ణప్ప మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు పలువురు అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
‘ప్రైవేట్’కే అధిక ప్రాధాన్యం..
ప్రతిభా అవార్డులు అందించే విషయంలో ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాలో 400 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఆయా పాఠశాలల్లో పదో తరగతి చదివిన 85 మందికే ప్రతిభా పురస్కారాలు అందించారు. కానీ ప్రైవేటు పాఠశాల్లో చదివిన 102 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించడం విశేషం.
కష్టపడి చదివి తల్లిదండ్రులకు
పేరు తీసుకురావాలి
విద్యార్థులకు ఎమ్మెల్యే సింధూరరెడ్డి, కలెక్టర్ చేతన్ పిలుపు
పది, ఇంటర్లో ప్రతిభ చూపిన వారికి ‘షైనింగ్ స్టార్’ అవార్డుల ప్రదానం

చదువుతోనే ఉజ్వల భవిత