
‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అరికట్టాలి
పుట్టపర్తి టౌన్: నిజాన్ని నిర్భయంగా రాస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్న ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులను అరికట్టి, దుండగులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు, ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో జర్నలిస్టులు మాట్లాడారు. టీవీలో చర్చ సందర్భంగా ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదించడం సరికాదన్నారు. చర్చలో పాల్గొన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమన్నారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కక్షగట్టి డిబేట్లో వ్యాఖ్యాతగా ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆరెస్టు చేయించిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు జరిగాయన్నారు.ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలపైనే దాడులు చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై కూడా వరుసగా రెండురోజులు కూటమి పార్టీల నేతలు దాడులు చేశారన్నారు. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందన్నారు. అందువల్ల దాడి ఘటనలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి వారి వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్చిన అవసరం ఉందన్నారు. పత్రికల్లో, టీవీల్లో ఏదైనా ఓ కథనం, చర్చ అభ్యంతరకరంగా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలి గానీ, గూండాలతో దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులు సాయికృష్ణారెడ్డి, విజయశేఖర్రెడ్డి, కేశవరెడ్డి, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి
పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు