
నేటి నుంచి విత్తన వేరుశనగ పంపిణీ
పుట్టపర్తి అర్బన్: రాయితీపై రైతులకు అందజేసే విత్తన వేరుశనగ పంపిణీని జిల్లాలో మంగళవారం ప్రారంభం కానుంది. పుట్టపర్తి మండలం పెడపల్లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి విత్తన పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) సుబ్బారావు తెలిపారు. ఆ వెంటనే ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విత్తన పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వం జిల్లాకు 63,918 క్వింటాళ్ల విత్తనం కేటాయించగా, ఇప్పటి వరకూ 29 వేల క్వింటాళ్ల విత్తనం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కే–6, టీసీజీఎస్–1694 విత్తనం 30 కేజీల బస్తా పూర్తి ధర రూ.2,790 కాగా, 40 శాతం సబ్సిడీ పోనూ రైతు తన వాటాగా రూ.1,674 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక కదిరి లేపాక్షి రకం 30 కేజీల బస్తా పూర్తి ధర రూ.2,460 కాగా, సబ్సిడీ పోనూ రైతు తన వాటాగా రూ.1,476 చెల్లించాల్సి ఉంటుందన్నారు. గరిష్టంగా 3 బస్తాల విత్తనం అందించనున్నట్లు డీఏఓ వెల్లడించారు. ఇక కందులు కూడా మినీకిట్స్ రూపంలో త్వరలోనే పంపిణీ చేస్తారన్నారు.