
అప్పులు తీర్చే మార్గం కానరాక వ్యక్తి ఆత్మహత్య
బత్తలపల్లి: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన సిరప్పగారి శ్రీరాములు(41)కు భార్య రామాంజినమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ, ఇతర అవసరాలకు గ్రామంలో తెలిసిన వారి వద్ద పదేళ్ల క్రితం అప్పులు చేశాడు. ఈ అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.12 లక్షలకు చేరుకుంది. అప్పు తీర్చాలంటూ ఒత్తిళ్లు తీవ్రం కావడంతో దిక్కు తోచని స్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఐపీ నోటీసులు పంపాడు. అనంతరం అప్పులు ఇచ్చిన వారికి ముఖం చూపించలేక పదేళ్ల క్రితం గ్రామం విడిచి చైన్నెకు వలస వెళ్లి అక్కడే కూలి పనులతో జీవనం సాగించసాగాడు. ఐదు నెలల క్రితం చైన్నె నుంచి తిరిగి వచ్చి బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న బీసీ కాలనీలో నివాసముంటున్నాడు. తన పరిస్థితిని తలుచుకుని మదనపడుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తన భార్య రామాంజినమ్మతో ‘నేను అప్పులు తీర్చలేను, అప్పలోళ్లకి నా మొహం కూడా చూపించలేకున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. రాత్రి భోజనం ముగించుకున్న రామాంజినమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి మిద్దిపైకి వెళ్లి నిద్రించింది. ఇంట్లో నిద్రించిన శ్రీరాములు అర్ధరాత్రి సమయంలో ప్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కిందకు దిగి వచ్చిన కుటుంబసభ్యులు.. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న శ్రీరాములును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, రామాంజినమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.