పోలియో రహిత జిల్లానే లక్ష్యం
● కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం కోరారు. ఇందుకోసం ఈనెల 21న (ఆదివారం) నిర్వహిస్తున్న పల్స్పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పల్స్పోలియో పై అవగాహన కల్పించడానికి శనివారం పుట్టపర్తిలోని ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గణేష్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అప్పుడే పుట్టిన బిడ్డ నుంతి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. జిల్లాలో 2,11,391 మంది పిల్లలకు 21వ తేదీ (ఆదివారం) ఉదయం నుంచి పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 2,037 పోలియో బూత్లు, 8,140 మంది సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 21వ తేదీ పోలియో చుక్కలు వేయించుకోని పిల్లల కోసం 22, 23 తేదీల్లో ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు.
రీసర్వే పారదర్శకంగా చేయండి..
ప్రశాంతి నిలయం: భూ తగాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జిల్లాలో చేపట్టిన రీసర్వే పారదర్శకంగా సాగాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీ–సర్వే, హాస్టల్ నిద్ర తనిఖీలు, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, జీఎస్ డబ్లూఎస్ డాక్యుమెంట్ల అప్లోడ్ తదితర అంశాలపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి అభ్యంతరాలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. తహసీల్దార్లు,ఆర్డీఓలు ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ నిద్ర, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలు స్థితిగతులు, పురోగతిపై చర్చించారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో తనిఖీల్లో భాగంగా విద్యార్థుల భద్రత, హాజరు, వసతి సదుపాయాలు తాగునీరు, విద్యుత్, సచివాలయాలు, భోజన నాణ్యత తదితర అంశాలపై నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సువర్ణ, వీఎస్ఎస్ శర్మ, మహేష్, అనంద్కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
బాలికతో అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు
హిందూపురం: తమ కూతురుతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు యువకులపై చర్యలు తీసుకోవాలని ఓ ఇంటర్ విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక వన్టౌన్ పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. మేళాపురానికి చెందిన సురేష్, నిఖిల్ తమ అమ్మాయికి వాట్సాప్, ఇన్స్టాలో మెసేజ్లు పంపుతున్నారన్నారు. ఈనెల 18న తమ అమ్మాయిని లేపాక్షికి తీసుకెళ్లి, సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారన్నారు. శారీరకంగా వాడుకొని వదిలేస్తున్నారని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. ఈ విషయంపై వన్టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడును అడగ్గా, కేసు నమోదు చేశామన్నారు. మైనర్ కాబట్టి గట్టిగా చెప్పలేమని, విచారణ చేస్తున్నామన్నారు.


