అక్కడంతా.. ఆ ఇద్దరే! | - | Sakshi
Sakshi News home page

అక్కడంతా.. ఆ ఇద్దరే!

May 27 2025 12:43 AM | Updated on May 27 2025 12:43 AM

అక్కడంతా.. ఆ ఇద్దరే!

అక్కడంతా.. ఆ ఇద్దరే!

సాక్షి, పుట్టపర్తి: ప్రజలు అనారోగ్యం బారిన పడితే వైద్యం చేసే ఆరోగ్య శాఖ జబ్బు బారిన పడింది. ఇద్దరు అసిస్టెంట్లు దళారీ అవతారమెత్తి.. వసూళ్లు చేస్తుండటం కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా క్లినిక్‌ మొదలు.. నర్సింగ్‌ హోం వరకు.. నెల, ఆరు నెలలు, ఏడాదికి చొప్పున టార్గెట్‌ పెట్టుకుని మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెలవు కావాలన్నా.. ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు కావాలన్నా.. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. కొత్త ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌.. పాతవి రెన్యూవల్స్‌తో పాటు తనిఖీ చేయకుండా ఉండాలన్నా.. అడిగినంత సమర్పించుకోవాల్సిందే.

అసిస్టెంట్‌లే.. దళారీలుగా..

ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు నుంచి సెలవులకు అనుమతులు.. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్స్‌ వరకు.. ప్రతి విషయంలో ఆ ఇద్దరు అసిస్టెంట్‌లు దళారీలుగా మారి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి పైసలు పంపనిదే.. ఫైలు కదలని పరిస్థితి. ఎఫ్‌ఆర్‌ఎస్‌, సెలవులన్నీ.. ఓ అసిస్టెంట్‌కు.. రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్స్‌ విషయంలో మరో అసిస్టెంట్‌ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో.. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఒకరిపై మరొకరు చెప్పుకొంటూ పబ్బం గడుపుతున్నారు. పైగా తమపై ఎక్కడ ఫిర్యాదు చేసినా.. ఇబ్బంది లేదని.. కార్యాలయంలో ఖర్చులను తామే భరిస్తున్నామని.. ఎవరూ ఏమీ అనే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలుకుతున్నారు.

విజయవాడకు చేరిన పంచాయితీ

ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ నిర్వాకంపై కొందరు మెడికల్‌ ఆఫీసర్లు పక్కా ఆధారాలతో జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు విన్నవించారు. ఆ తర్వాత నేరుగా విజయవాడలోని కమిషనర్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ నుంచి అధికారులు సీరియస్‌ కావడంతో పాటు డీఎంహెచ్‌ఓపై కలెక్టర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖలో జరిగే విషయాలపై ఎందుకు స్పందించకుండా ఉన్నారని.. వెంటనే విచారణ చేయించి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

● ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లలో ఒకరిపై శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఒకరిని సోమవారం కడప రీజనల్‌ డైరెక్టర్‌ (ఆర్‌డీ) వద్ద సరెండర్‌ చేశారు. మరొకరిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది.

దళారీ అవతారమెత్తిన సీనియర్‌ అసిస్టెంట్లు

డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో

వసూళ్ల పర్వం

ఏ పని కావాలన్నా..

వారి వద్దకు వెళ్లాల్సిందే

ఆస్పత్రుల రెన్యూవల్‌ విషయంలో భారీగా దందా

విచారణ చేస్తున్నాం

కొందరు మెడికల్‌ ఆఫీసర్లు ఓ సీనియర్‌ అసిస్టెంట్‌పై ఫిర్యాదు చేస్తే.. ఆయనను ఆ విధుల నుంచి తప్పించాను. ఆ తర్వాత విజయవాడకు ఎవరు ఫిర్యాదు చేశారనే దానిపై విచారణ జరుగుతోంది. అవన్నీ తప్పుడు మెయిల్స్‌గా అనుమానం ఉంది. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. కార్యాలయంలో ఖర్చులకు ప్రభుత్వమే భరిస్తుంది. ఖర్చుల కోసం సిబ్బందితో వసూళ్లు చేయడం లేదు.

– డాక్టర్‌ ఫైరోజాబేగం, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement