ప్రమాదంలో మెకానిక్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో మెకానిక్‌ మృతి

May 27 2025 12:43 AM | Updated on May 27 2025 12:43 AM

ప్రమా

ప్రమాదంలో మెకానిక్‌ మృతి

ధర్మవరం రూరల్‌: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని శాంతినగర్‌కు చెందిన జయరాములు కుమారుడు నవీన్‌కుమార్‌ కారు మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య కీర్తన ఉన్నారు. సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆయన చిగిచెర్ల రోడ్డులో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఘటనపై ధర్మవరం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిరసన

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సీనియర్‌, జూనియర్‌ ఎల్‌డీ కంప్యూటర్స్‌ సిబ్బంది సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లతో పని భారం పెరుగుతోందని, దీంతో ఒత్తిళ్ల కారణంగా తప్పిదాలు చోటు చేసుకుంటే కంప్యూటర్‌ ఆపరేటర్లను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తక్షణమే ఉపసహరించుకోవాలని, ఉద్యోగుల పరిధిలో ఉన్న పనులను మాత్రమే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫిరోజ్‌బేగంకు వినతి పత్రం అందజేశారు.

కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి

తలుపుల: వీధి కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వివరాలు... ముదిగుబ్బ గ్రామానికి చెందిన మల్లికార్జున గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన గొర్రెల మందను మేపు కోసం తలుపుల మండలం మాడికవాండ్లపల్లి సమీపంలోని సూర్యనారాయణరెడ్డి పొలంలో వదిలాడు. సోమవారం 30 గొర్రె పిల్లలను జార్లీ (గంప) కింద వేసి పెద్ద గొర్రెలను మేపునకు తోలుకెళ్లారు. ఆ సమయంలో వీధి కుక్కలు జార్లీలో చొరబడి బీభత్సం సృష్టించడంతో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరో ఐదు గొర్రెపిల్లుల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఘటనపై బాధిత కాపరి మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు వేడుకలు

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని కొత్తపేట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గణపతి సచ్చిదానంద స్వామి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. గణపతి సచ్చిదానంద జ్ఞాన బోధ సభ ట్రస్ట్‌, వలంటీర్ల ఆధ్వర్యంలో సచ్చిదానంద స్వామి చిత్రపటాన్ని పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దత్త శివ, మెటికల కుళ్లాయప్ప, రామంజనేయులు, సాగా సురేష్‌, రంగా శ్రీనివాసులు, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు

కేటాయించడం తగదు

తనకల్లు: మండలంలోని మల్లిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ సోలార్‌ కంపెనీకి కేటాయించడం తగదని పలు గ్రామాల ప్రజలు తహసీల్దార్‌ శోభా సువర్ణమ్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామం సమీపంలోని సర్వే నంబర్‌ 63లో ఉన్న ప్రభుత్వ భూములను సోలార్‌ కంపెనీకి మంజూరు చేయడానికి రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలన్నారు. ఆ భూములను సోలార్‌కు కేటాయిస్తే దాదాపు 15 గ్రామాలకు చెందిన పశువులకు మేత, నీరు ఉండదని తెలిపారు. కార్యక్రమంలో పెండ్లుగుండుతండా, జామ్లానాయక్‌ తండా, పెద్దపల్లి, ఎర్రబల్లి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ప్రమాదంలో మెకానిక్‌ మృతి 1
1/2

ప్రమాదంలో మెకానిక్‌ మృతి

ప్రమాదంలో మెకానిక్‌ మృతి 2
2/2

ప్రమాదంలో మెకానిక్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement