
పోలీసులు న్యాయం చేయడం లేదు
పుట్టపర్తి టౌన్: కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నా.. పోలీసులు మాత్రం న్యాయం చేయడంలేదంటూ డీఎస్పీ విజయకుమార్ ఎదుట బాధితుడు చెన్నకేశవులు వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసి, తన సమస్య వివరించారు. వివరాలు... కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన చెన్నకేశవులు, విజయలక్ష్మి దంపతులకు అదే గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 51, 552, 553, 836, 837లో 8.70 ఎకరాల భూమి ఉంది. ఇందులో 550 మామిడి చెట్లతో పాటు వరి సాగు చేస్తున్నారు. 2005లో చెన్నకేశవులు అన్న రమణ మృతి చెందాడు. ఆయన పేరున ఉన్న భూమిని 2007లో చెన్నకేశవులు, విజయలక్ష్మి పేరుతో కొనుగోలు చేశారు. అయితే భూమిలో తమకూ హక్కు ఉందని అన్న కుమారుడు రెడ్డి కుమార్, బంధువులు రెడ్డెమ్మ, రెడ్డెప్పరెడ్డి అడ్డు తగలడంతో దీనిపై చెన్నకేశవులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో చెన్నకేశవులుకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా దాయాదులు అడ్డుతగుతుండడంతో కోర్టు ఉత్తర్వులు నకళ్లను జతపరుస్తూ పోలీసులకు చెన్నకేశవులు ఫిర్యాదు చేశాడు. ఇందులో టీడీపీ నాయకులు జోక్యం చేసుకోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఈ విషయంగా తమకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయకుమార్కు బాధితుడు చెన్నకేశవులు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన డీఎస్పీ వెంటనే కదిరి పీఎస్కు ఫోన్ చేసి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు.