
హెర్బల్ పార్కుకు స్థల పరిశీలన
ధర్మవరం అర్బన్: పట్టణంలో హెర్బల్ పార్కు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలిస్తున్నామని ఏపీ మెడిషనల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ చంద్రశేఖర్ తెలిపారు. పట్టణంలో సోమవారం గాంధీనగర్, రామ్నగర్లో ఉన్న మున్సిపల్ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ స్థలాల్లో 58 రకాల ఔషధ మొక్కలతో ప్రత్యేక హెర్బల్ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఏర్పాట్ల కోసం స్థలాలను పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, తహసీల్దార్ నటరాజ్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్బాబు పాల్గొన్నారు.
‘మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించాలి’
ముదిగుబ్బ: ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వైపునకు వెళ్లే ఎన్హెచ్ 342 జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వారికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధర ప్రకారం ఎకరానికి రూ.8,90,000 మాత్రమే చెల్లిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యాల్యుషన్ ప్రకారం ఎకరానికి రూ, 63,88,000 ఉందన్నారు. వీటి ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు తహసీల్దార్ నారాయణ స్వామికి వినతిపత్రం అందజేశారు. మాకు పరిహారం అందించే వరకు పనులను నిలిపివేయాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో రైతులు సోమల ప్రకాష్నాయుడు, రమేష్బాబు, సనత్కుమార్, విశ్వనాథ్, ప్రభాకర్ నాయుడు, హనుమంతు, అశోక్, రాగినాయుడు, ప్రసాద్, లక్ష్మీదేవి, నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.
రైతు ఇంట చోరీ
రొద్దం: మండలంలోని కంచిసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకిల క్రిష్టప్ప ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆర్డీటీ సౌజన్యంతో గ్రామంలో ఇంటిని నిర్మించుకుని అందులోనే నివాసముంటున్న క్రిష్టప్ప.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు నగలు, 12 తులాల వెండి సామగ్రి, రాగి పాత్ర అపహరించినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.