
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాప్తాడు నియోజకవర్గ
పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎవరు వెళ్లినా.. భయబ్రాంతులకు గురి చేశారు. ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాపిరెడ్డిపల్లికి విచ్చేశారు. అదే రోజున హెలిప్యాడ్ ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. పైలట్, కోపైలట్కు నోటీసులు పంపించారు. మరో పది మందిని రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ రిమాండ్కు పంపించాలనే ఉద్దేశంతో ధర్మవరంలో జడ్జి ఇంటికి అరెస్టు చేసిన వారిని తీసుకెళ్లగా ఆయన బెయిల్ ఇచ్చి పంపించారు. ఇదిలా ఉండగా సోమవారం హెలిప్యాడ్ ఘటన నేపథ్యంలో మరో 71 మంది వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు.
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకపాలనకు శ్రీకారం చుట్టింది. ఏదో ఒక రకంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఏ ఒక్కరినీ వదలడం లేదు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక రోజు నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి స్థానికంగా ఉండేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను రోజూ ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
పరామర్శకు వచ్చినా తిప్పలే..
టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చినా చట్ట ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ పోలీసులపై ఒత్తిళ్లు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు సైతం తమ విధులను మరచి అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారు. పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య హత్యను ఖండిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వారందరిపై కూటమి నేతలు దృష్టి సారించారు. రోజుకో కేసులో ఇరికిస్తున్నారు.
ఎంపీడీఓ కార్యాలయం వద్ద దాడితో ..
ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా మార్చి 26వ తేదీన రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో అనెక్సర్ 1, 2 ఇచ్చేందుకు వెళ్లిన ముగ్గురిపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా వారు వచ్చిన వాహనాల్లో మారణాయుధాలు ఉంచి అక్రమ కేసులు బనాయించేందుకు పన్నాగం పన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నేతలు బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని వెళ్లారు. తాము చెప్పినట్లు ఎన్నికలు జరగాలని.. ఎవరో వచ్చి గెలుస్తామంటే ఎలా అంగీకరిస్తామని దబాయించారు.
హత్యతో భయం.. భయం..
ఉగాది పండుగ రోజున రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు రాజన్న మనవడు ఆదర్శ్.. అదే గ్రామానికి చెందిన కురుబ లింగమయ్యపై దాడి చేశాడు. లింగమయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని అడ్డుకునేయత్నం చేశాడనే కక్షతో హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గొడవకు.. హత్యకు నాలుగైదు రోజులు గడువు ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే హత్య చేసే సమయంలో సుమారు 20 మంది వరకూ ఉన్నట్లు తెలిసింది. కానీ కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది.
రంగంలోకి ప్రత్యేక బలగాలు..
పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన కేసులో ఇప్పటికే పది మందిని అరెస్టు చేసి బెయిల్పై వదిలారు. అయితే మరింత మందిని అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్, బెంగళూరుకు పోలీసు ప్రత్యేక బలగాలు వెళ్లినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో ముందుగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ నడుస్తోందన్న విమర్శలున్నాయి.
పరామర్శించిన వారిపైనే కేసులు..
రామగిరిలో భయం .. భయం
పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతల అరాచకం
ఎమ్మెల్యే పరిటాల సునీత కనుసన్నల్లోనే ఖాకీల విధులు
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు
పరామర్శకు వెళ్లినా టార్గెట్ చేస్తున్న వైనం