
పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి
ధర్మవరం అర్బన్: పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా చట్ట ప్రకారం పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హితవు పలికారు. వైఎస్సార్సీపీకి చెందిన పది మంది నాయకులపై అక్రమ కేసులు బనాయించినా వారికి కోర్టులో బెయిల్ రావడంతో న్యాయం, ధర్మం గెలిచాయని హర్షం వ్యక్తం చేశారు. రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ధర్మవరం కోర్టును ఆశ్రయించగా ఆదివారం రాత్రి పది మందికి జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా విడుదలైన వారితో కలసి ఉషశ్రీచరణ్ విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయిస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వం అండతో వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తే బెదిరేదిలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమాభివృద్ధి సాధ్యమని ప్రజలకు తెలిసిపోయిందని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తే బెదిరేదిలేదు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్