
ధర్మవరానికి చెడ్డపేరు తెచ్చారు
ధర్మవరం: ‘‘ధర్మవరం పేరు చెబితే సుపరిపాలన గుర్తుకు వచ్చేది. అభివృద్ధి కళ్లముందు కనిపించేది. కానీ కూటమి సర్కార్ కొలువుదీరిన 11 నెలల కాలంలోనే ధర్మవరానికి చెడ్డపేరు తీసుకువచ్చారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మార్చారు. సహజ వనరులు కొల్లగొడుతూ సొంత జేబులు నింపుకుంటన్నారు. పరిపాలన లేదు...ఒక్క సంక్షేమ పథకం లేదు. పైపెచ్చు పేదలను హింసిస్తున్నారు..ఇదేనా మీ పాలన’’ అంటూ బీజేపీ నేతలపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, గజ్జల శివ తదితరులు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని చిత్రావతి నది నుంచి అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారన్నారు. అలానే ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో కూటమి పార్టీల నాయకులు మట్టి మాఫియాగా ఏర్పడి కొండలను, గుట్టలను తవ్వి అక్రమార్జన చేస్తున్నారన్నారు. వీరి దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. ఇందుకోసం ఆర్డీఓ కార్యాలయానికి ప్రతినెలా రూ.10 లక్షలు లంచాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి లంచాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఇక్కడి ప్రజలు మునుపెన్నడూ చూడలేదన్నారు.
కేతిరెడ్డిపై ఆరోపణలు తగవు
ఇటీవల కాలంలో కొంతమంది బీజేపీ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు కేతిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేతిరెడ్డిని విమర్శించే వారు తమస్థాయి తెలుసుకోవాలన్నారు. నిజంగా అభివృద్ధి ఎవరు చేశారో ధర్మవరం ప్రజల్ని అడిగితే తెలుస్తుందన్నారు. పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాన్ని తెచ్చి నీటిఎద్దడిని నివారించిన ఏకై క నాయకుడు కేతిరెడ్డి అన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయన కట్టించిన ఆసుపత్రిలోనే మీరు డయాలసిస్ సెంటర్ను పెట్టిన విషయాన్ని గ్రహించాలన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా కేతిరెడ్డి 24 వేల ఇంటిపట్టాలను మంజూరు చేయించారన్నారు. ఆర్ఓబీలు, అండర్ బ్రిడ్జిలు, రహదారులు, శివారు ప్రాంత కాలనీలకు సమానంగా సీసీరోడ్లు, డ్రైన్లు నిర్మించారన్నారు. అలాంటిది తామెందుకు అభివృద్ధికి అడ్డుపడతామని ప్రశ్నించారు. ఇప్పటికై నా చిల్లర వేషాలు మానుకుని ప్రజల కోసం పనిచేయకపోతే గుణపాఠం చెప్పి తీరుతామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు రమాదేవి, నాగరాజు, చింతా యల్లయ్య, అత్తార్ జిలాన్, వార్డు ఇన్చార్జ్లు ఎస్పీ బాషా, కేశగాళ్ల కృష్ణ, కత్తెపెద్దన్న, మట్టెద్దుల కేశవరెడ్డి, గడ్డంరంగ, బాలం గోపాల్ పాల్గొన్నారు.
11 నెలల కూటమి పాలనలో
అవినీతి, దందాలకు కేరాఫ్గా మార్చారు
సహజ వనరులు కొల్లగొట్టారు..
మున్సిపాలిటీని అవినీతి కూపంలోకి నెట్టారు
బీజేపీ నాయకులపై వైఎస్సార్సీపీ
నాయకుల ఆగ్రహం