
అన్నదాతను విస్మరించిన కూటమి సర్కార్
అప్పు కోసం ఆత్మగౌరవాన్ని చంపుకుని..
చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రైతులకు అర్ధరూపాయి కూడా సాయం చేయలేదు. పైగా ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. పంటనష్టం అంచనాలతో సరిపెట్టారు. నమ్మి ఓటేసినందున నట్టేట ముంచారు.
– మడకశిర మండలం ఈచలెడ్డి గ్రామానికి
చెందిన రైతు మంజునాథ్ ఆవేదన
రబీ పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. పెట్టుబడులు సైతం చేతికందక రైతులు అప్పులు మూటగట్టుకున్నారు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అంచనాలకే పరిమితమైంది. ఇపుడు ఖరీఫ్కు సమయం ఆసన్నమవుతుండగా పెట్టుబడి కోసం అన్నదాత అత్మగౌరవాన్ని చంపుకుని ప్రైవేటు వ్యక్తుల వద్ద చేయిచాచాల్సిన దుస్థితి తలెత్తింది. చంద్రబాబు ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ ఊసే లేకపోవడంతో రైతులంతా వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన ‘రైతు భరోసా’ను తలచుకుంటున్నారు. వ్యవసాయం దండుగ అని ఎప్పుడో తేల్చేసిన చంద్రబాబు...తన అభిప్రాయం మార్చుకోలేదంటున్నారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద ఏటా ప్రతి రైతుకూ రూ.20 వేలు సాయం అందిస్తాం. రైతుకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాం.
– ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు అందించేందుకు కేటాయింపులు చేశాం.
– గత ఫిబ్రవరిలో శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన
● పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సకాలంలో జమ
● 11 నెలలుగా విడుదల కాని రాష్ట్ర ప్రభుత్వ వాటా
● పెట్టుబడి సాయం కోసం ఎదురు చూపు
● ఒక్కో రైతుకు చంద్రబాబు రూ.20 వేలు బాకీ
● జిల్లా వ్యాప్తంగా అన్నదాతలకు రూ.560 కోట్లు ఎగనామం
● పెట్టుబడుల కోసం ‘ప్రైవేటు’ అప్పులు చేస్తున్న రైతులు
కదిరి/మడకశిర రూరల్ : ‘ఇది మంచి ప్రభుత్వం’ అని గొప్పలు చెప్పిన చంద్రబాబు సర్కార్ ఇంత వరకూ రైతులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేలు ‘అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పన చంద్రబాబు... అధికారం చేపట్టి 11 నెలలవుతున్నా.. ఇప్పటి దాకా దానిపై ఉలుకూ పలుకూ లేదు. కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే డబ్బులు మాత్రం సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అధికార టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ‘సుఖీభవ’పై అదిగో..ఇదిగో అని చెప్పడమే కానీ ఖాతాల్లో నగదు జమ చేసింది మాత్రం లేదు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సైతం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ రైతుల పక్షాన మాట్లాడ లేదు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తవుతోందని, ఈ పథకం ద్వారా జిల్లాలో ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున సుమారు రూ.560 కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టారని అన్నదాతలు లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని సంబంధిత అధికారులు అంటున్నారు.
గతంలో అన్నదాతకు ఆర్థిక భరోసా
ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ఇందులో కేంద్రం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఇచ్చే రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ.7,500 కలిపి మొత్తంగా 13,500 ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో మొత్తం 2,92,170 మంది రైతులుండగా... వీరిలో 2,79,556 మంది రైతులకు గత ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.1767.09 కోట్లు లబ్ధి చేకూరింది.
మూడు విడతల్లో జమ
గత ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ పంట వేసేముందు ఏటా సరిగ్గా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద రూ.7,500 ఖాతాల్లో జమ చేసేది. తర్వాత అక్టోబర్ నెలలో పంట కోతతో పాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు ఇచ్చేది. ఆ తర్వాత జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు ఇచ్చేది...ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు మొత్తం రూ.13,500 చొప్పున గత ప్రభుత్వం రైతులకు నగదు రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఏటా సకాలంలో రైతులను ఆదుకుంటూ వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇలా అనేక రకాలుగా గత ప్రభుత్వం ఆదుకుంటూ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకూ రైతు సంక్షేమం గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అతివృష్టి, అనావృష్టితో జిల్లాలో గత ఖరీఫ్, రబీలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదుకోవాల్సిన కూటమి సర్కార్ కేవలం అంచనాలతో సరిపెట్టింది. దీంతో పెట్టుబడులు కూడా చేతికందక రైతులు అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం ఖరీఫ్లో పంటల సాగుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆత్మగౌరవాన్ని చంపుకుని ప్రైవేటు వ్యక్తుల వద్ద చేతులు చాచాల్సిన పరిస్థితి తలెత్తింది.

అన్నదాతను విస్మరించిన కూటమి సర్కార్

అన్నదాతను విస్మరించిన కూటమి సర్కార్