
తవ్వుకో..తరలించుకో
హిందూపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రకృతి వనరులను చెరబట్టారు. నదులు, చెరువుల్లోని ఇసుకను అక్రమంగా తవ్వుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో హిందూపురం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
రోజూ వందలాది వాహనాల్లో తరలింపు
హిందూపురం నియోజకవర్గంలో కుముద్వతి, కుషావతి, పెన్నా నదుల పరివాహక ప్రాంతాల్లోని ఇసుకను టీడీపీ నేతలు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ముఖ్యంగా హిందూపురం మండలం సుగూరు, బోరెడ్డిపల్లి, బేవనహళ్లి, సంజీవరాయుడిపల్లి, కిరికెరతోపాటు చిలమత్తూరు పరిధిలో కుషావతి నది పరీవాహకంలోని బలిజపల్లి, నల్లరాళ్లపల్లి, అప్పనపల్లి, దేవరపల్లి, కొడికొండ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. అలాగే చిత్రావతి నది సమీపంలో శెట్టిపల్లి, తిమ్మాడిపల్లి ప్రాంతంలోనూ ఇష్టానుసారం ఇసుకను తవ్వుకుని ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు తూమకుంట, సంతేబిదనూర్, బేవనహళ్లి ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లోని ఇసుక తవ్వుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో తవ్విన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా జాతీయ రహదారి మీదుగా కర్ణాటక ప్రాంతంలో నూతనంగా వేస్తున్న లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఇలా రోజూ 100 నుంచి 150 లోడ్లు వరకు డంప్ అవుతుంటాయని సమాచారం. ట్రాక్టర్ ఇసుక రూ.2,500 వేల నుంచి రూ.3,500 వేలకు విక్రయిస్తున్నారు. ఇసుక క్వాలిటీని బట్టి టిప్పర్ రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేసుకుంటున్నారు.
కళ్లప్పగించి చూస్తున్న అధికారులు
హిందూపురంలోని కిరికెర, బేవనహళ్లి, సంతేబిదనూర్, కంచినపల్లి ప్రాంతాల్లోని ఇసుకను రాత్రిపూట కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందస్తుగా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను ఓ రహస్య ప్రాంతంలో డంప్ చేసి ఆ తర్వాత అవసరమైన ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా సరఫరా చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా తూమకుంట చెక్పోస్టు మీదుగానే సాగుతున్నా... పోలీసులు, విజిలెన్స్ అధికారులు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు.
హిందూపురంలో జోరుగా
ఇసుక అక్రమ రవాణా
నది పరీవాహక ప్రాంతాల్లో
భారీగా తవ్వకాలు
రోజూ వందల ట్రాక్టర్లతో కర్ణాటకకు తరలింపు
పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్,
పోలీసు అధికారులు
కఠిన చర్యలు తప్పవు
నదీ పరీవాహక ప్రాంతాలు, చెరువుల వద్ద ఇసుకను తవ్వుకోవడం, రవాణా చేయడం నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమంగా రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.
– మహేష్, డీఎస్పీ, హిందూపురం

తవ్వుకో..తరలించుకో