
రూ. కోట్ల విలువైన భూమి స్వాహా
ధర్మవరం రూరల్: రూ. కోట్లు విలువైన పట్టా భూమిని ఆన్లైన్లో మరొకరి పేరుపై బదలాయింపు జరిగింది. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతులు లబోదిబోమంటున్నారు. ఈ అంశంలో రెవెన్యూ అధికారుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం తహసీల్దార్ను బాధిత రైతులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన కృష్ణమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుణుతూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 351–2 లెటర్లో ఉన్న 4.54 ఎకరాల పట్టా భూమిని కృష్ణమ్మకు 2008లో ఆమె తల్లి వెంకటలక్ష్మమ్మ రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. అయితే ఈ అంశంపై కృష్ణమ్మ కుటుంబసభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుని అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ భూమిపై కొందరు కన్నేశారు. ఆ భూమితో వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా... మిగులు భూమి కింద చూపి రెవెన్యూ అధికారులను లోబర్చుకుని భారతి అనే మహిళ పేరుపై ఆన్లైన్లో మార్పు చేయించారు. అంతటితో ఆగకుండా వెనువెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఇటీవల విషయం తెలుసుకున్న కృష్ణమ్మ కుటుంబసభ్యులు మూకుమ్మడిగా మంగళవారం తహసీల్దార్ నటరాజ్ను కలసి ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించారు. మొత్తం ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల ప్రమేయముందని, ఇందు కోసం రూ.5 లక్షల వరకు చేతులు మారినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న అధికారులు జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు సమయం కోరినట్లు తెలిసింది. కాగా, ధర్మవరం పట్టణానికి సమీపంలో ఉన్న ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. కోట్లు ఉంటుందని రియల్టర్లు అంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ నటరాజ్ మాట్లాడుతూ.. రికార్డులను పరిశీలించి తప్పిదాలు చోటు చేసుకుని ఉంటే సరిచేస్తామని పేర్కొన్నారు.
ఆన్లైన్లో మరొకరి పేరుపై బదలాయింపు
రెవెన్యూ అధికారుల ప్రమేయంపై
అనుమానాలు
భగ్గుమంటున్న బాధితులు