
సమస్యలు పరిష్కరించండి
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రరావు డిమాండ్ చేశారు. నేషనల్ మజ్దూన్ యూనియన్ (ఎన్ఎంయూ) కడప జోన్ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఎన్.వి.రమణ అధ్యక్షతన కడప జోన్ ప్రథమ మహాసభ శుక్రవారం పుట్టపర్తిలోని సాయిఆరామంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రరావు, నాయకులు శివారెడ్డి, భాస్కరనాయుడు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చెన్నారెడ్డి హాజరై, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ అమలు చేయాలని, అన్ని కేటగిరీల్లో పదోన్నతులు కల్పించి ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వం ద్వారానే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ సిబ్బందికి అప్పగించాలని, అన్ని గ్యారేజ్ల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నైట్ అలవెన్స్లను రూ.300 నుంచి రూ.400కు పెంచాలని కోరారు. సిక్ లీవ్లకు సంబంధించి జీతాలు చెల్లించాలన్నారు. పాత వైద్య విధానాన్ని పునరుర్దరించాలన్నారు. ఉద్యోగులపై వేధింపులు ఆపాలన్నారు. డిమాండ్ల సాధనకు నిరంతర పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతనం కడప జోనల్ అధ్యక్షుడిగా వినోద్బాబు, జోనల్ కార్యదర్శిగా చెన్నారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకర్ రెడ్డి, కార్యదర్శులు చెంచులయ్య, ఇస్మాయిల్, ఎర్రిస్వామి, నాగరాజు, భద్రావతి, సీసీఎంసీ మెంబర్లు వినోద్, గోపాలప్ప, 52 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సూర్యచంద్రరావు