
‘ఎలాంటి బ్లాక్మెయిల్ చేయలేదు’
హిందూపురం టౌన్: బాలిక నగ్న వీడియోలతో తాము ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయలేదని హిందూపురంలోని మేళాపురానికి చెందిన జయలక్ష్మి, వెంకటేష్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాము వీడియోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నామనడం పూర్తిగా అవాస్తవమన్నారు. తమపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పట్టణానికి చెందిన సువర్ణ తనకు స్నేహితురాలని, తమ మధ్య ఉన్న బంధంతో సువర్ణకు దాదాపు రూ.2కోట్లకు పైగా నగదును విడివిడిగా ఇచ్చామన్నారు. ఆమె రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి, తన డబ్బును తిరిగి ఇస్తానని చెబితే, చెక్కులను, ప్రాంసరీ నోట్లను తీసుకుని ఇచ్చినట్లు వివరించారు. అయితే డబ్బు తీసుకుని చాలా కాలమైనా తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల వెళ్లి అడిగామన్నారు. దీంతో తమపై అసత్య ఆరోపణలు చేస్తూ అందరినీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిపై పోలీసులు సైతం విచారణ చేపట్టారని గుర్తు చేశారు. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వమంటే ఇలా బురద చల్లడం సబబు కాదని అన్నారు.