శభాష్‌.. స్టూడెంట్స్‌ | - | Sakshi
Sakshi News home page

శభాష్‌.. స్టూడెంట్స్‌

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

ఉత్తమ ఫలితాలు సాధించిన

విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు

నెల్లూరురూరల్‌: ఇటీవల విడుదలైన పదో తర గతి ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో విద్యార్థులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శనివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. అత్యధిక మార్కులు సాధించిన కావలి, ఉదయగిరి, పొదలకూరు పరిధిలోని విద్యార్థులు ఏ సంతోష్‌ (584), వీవీ సూర్య ప్రణీత్‌ (574), సీహెచ్‌ వినీత (574), పి ప్రవీణ్‌కుమార్‌ (574), ఆకుల సంతోష్‌ (562), జె నిరంజన్‌ (561), ఎం సాయిశశాంక్‌రెడ్డి (561), కార్తీక్‌ (558)లకు కలెక్టర్‌ చేతుల మీదు గా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.

వెంకయ్యస్వామి

సూక్తి స్ఫూర్తిదాయకం

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వెంకటాచలం: ‘నీవు తిన్నది నీది కాదు, నీవు పెట్టినదే నీది’ అన్న భగవాన్‌ శ్రీవెంకయ్యస్వామి సూక్తి సమాజానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మండలంలోని గొలగమూడిలో శనివారం భగవాన్‌ శ్రీ వెంకయ్యస్వామి చారిత్రక ప్రస్థానాన్ని చాటి చెప్పే విశ్వంభరుడు గ్రంథాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత దంపూరు రామకృష్ణ, ప్రచురణకర్త నాగినేని లక్ష్మయ్యనాయుడుని ఈ సందర్భంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ వెంకయ్యస్వామి ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అన్నదానం, విద్యాదానం, గోసంరక్షణ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం మంచి విషయమన్నా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, వెంకయ్యస్వామి ఆశ్రమ ఏఓ పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణభారత్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

నారాయణలో ఏఐ వర్క్‌షాపు

నెల్లూరు (టౌన్‌): నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ఎంబీఏ, ఎంసీఏ, సీఎస్‌ఈ, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ విబాగాలు సంయుక్తంగా ఏఐ వర్క్‌షాపు–2026ను నిర్వహించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ విభాగాధిపతి జేవీఆర్‌ఎస్‌ ప్రసాద్‌ ‘ఎసెన్షీయల్స్‌ ఆఫ్‌ ఏఐ’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందన్నారు. విద్యార్థులు భవిష్యత్‌ ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌ వంటి రంగాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నైపుణ్యాలతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సమస్య పరిష్కార సామర్థ్యం, క్రియేటివ్‌ థింకింగ్‌ అవసరమన్నారు. టీసీఎస్‌ వంటి ప్రముఖ సంస్థల్లో కెరీర్‌ అవకాశాలు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌, అసరమైన నైపుణ్యాలపై సూచనలు అందజేశారు. కళాశాల డైరెక్టర్‌ దత్తాత్రేయశర్మ, ప్రిన్సిపల్‌ రవిప్రసాద్‌, ఎంబీఏ డీన్‌ గంగినేని ధనుంజయ్‌, వివిధ విభా గాధిపతులు రాజేంద్ర, పెంచలయ్య, రామ్మోహన్‌, వరప్రసాద్‌,, మాల్యాద్రి, ప్లేస్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

ఆక్వా సాగులో వైరస్‌లను నిరోధించాలి

కోట: ఆక్వా సాగులో విజృంభిస్తున్న వైరస్‌లను సీడ్‌ తయారీలోనే గుర్తించి కట్టడి చేస్తే సాగు లాభదాయకంగా మారుతుందని మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌ సూచించారు. నేషనల్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం ఫర్‌ ఆక్వాటెక్‌ ఎనిమల్‌ డిసీజ్‌లో భాగంగా కాకినాడ, చైన్నె సంయుక్త బృందం మండలంలోని శ్రీనివాససత్రంలో ఉన్న టెక్నోమిన్‌ రొయ్యల హేచరీని సందర్శించారు. హేచరీలో పోస్ట్‌ లార్వా నమూనాలను సేకరించారు. ట్రాన్స్‌లూసెంట్‌ పోస్ట్‌, లార్వల్‌ డిసీజ్‌ సహా ఇతర వ్యాధుల గుర్తింపునకు ప్రయోగశాలకు పంపించారు. సిద్ధవరంలోని రొయ్యల గుంతల నుంచి నీటిని, రొయ్యల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓలు రెడ్యానాయక్‌, చైతన్య, ఫీల్డ్‌ అస్టెంట్‌లు వంశీ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement