సోమశిల: జిల్లాకే జలనిధి అయిన సోమశిల ప్రాజె క్ట్ నెలవైన గ్రామంలోనే రెండు నెలలుగా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన మహిళలు బిందెలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఈ ఘటన అనంతసాగరం మండలం సోమశిలలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని కలువాయి రోడ్డు కాలనీలో సుమా రు 150 కుటుంబాలు ఉన్నాయి. పెన్నానదిలో ఉన్న బోర్ల నుంచి నేరుగా ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా ఆ కుటుంబాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. రెండు నెలల నుంచి నీరు సక్రమంగా అందకపోవడంతో స్థానికులు ఎన్నోసార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా.. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానిక టీడీపీ నేత వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. అయితే ఆ నాయకుడు ‘మేము బిందెలతో నీళ్లు తెచ్చి మీ ఇళ్లలో పోయాలా’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని మహిళలు వాపోయారు. తాగునీరు సక్రమంగా అందక ప్రజలు నానా అవస్థలు పడుతు న్నా సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో బిందెలతో ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలు దాదాపు గంట పాటు నిలిచిపోయాయి. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


