● కూటమి అరాచకాలకు ప్రజలే గుణపాఠం చెబుతారు
● వైఎస్సార్సీపీ సమన్వయకర్త
నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి
వెంకటగిరి(సైదాపురం): ‘మున్సిపాలిటీలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసింది.. మరో రెండురోజుల్లో పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉందా’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మళ్లీ రాజధానికి భూములు కావాలంటూ రైతులను మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. పెన్నానదిని తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై గ్రీన్ ట్రిబ్యునల్కు పిటిషన్ దాఖలు చేస్తున్నామన్నారు. బాహాటంగా పెన్నానదిలో అక్రమంగా రోడ్లు వేసి ఇసుకను తవ్వేసి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంకటగిరిలో జాతీయ రహదారి పక్కనే ఇసుకను డంపింగ్ చేసి దోచుకుంటున్నారన్నారు. అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బాబు సర్కార్కు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదన్నారు. ప్రత్యేకాధికారుల పాలనను ఏర్పాటు చేసి మరింత దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నుతోందన్నారు. సమావేశంలో ఎస్ఈసీ సభ్యుడు బొలిగర్ల మస్తాన్యాదవ్, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, ముఖ్యనేత చిట్టేటి హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు బాలయ్య, ఆరి శంకరయ్య, పేర్నేటి సుబ్బారావు, ఆటంబాకం శ్రీనివాసులు, గోపాలకృష్ణ, పూజారి లక్ష్మి, ఉమామహేశ్వరి, కందాటి కల్యాణి, సుభావలి, విజయలక్ష్మి, మల్లీశ్వరి, కన్వీనర్లు ప్రసాద్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మన్నారపు రవికుమార్, వెందోటి కార్తీక్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


