1,580 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
కోవూరు: జిల్లాకు 2,600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. గురువారం పడుగుపాడు రైల్వే స్టేషన్కు యూరియా బస్తాలు చేరుకోగా ఆమె వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 1,580 మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాకు 1,020 మెట్రిక్ టన్నులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత, మండల వ్యవసాయాధికారిణి టి.రజని, సహాయ వ్యవసాయాధికారి నర్సారావు, సిబ్బంది పాల్గొన్నారు.
కత్తితో బెదిరించి
నగదు దోపిడీ
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లిన ఘటన నెల్లూరు మెక్లిన్స్రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోటమిట్ట మెక్లిన్స్రోడ్డులో హయత్బాషా అనే దివ్యాంగుడు నివాసముంటున్నాడు. గురువారం అతను సైకిల్పై తన అన్న గౌస్బాషా ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో మినీఫంక్షన్ హాల్ వద్ద రౌడీషీటర్ సుల్తాన్ అతడిని అడ్డుకుని రూ.వెయ్యి నగదు ఇవ్వాలని లేకుంటే చంపుతామని కత్తితో బెదిరించాడు. భయపడిన హయత్బాషా తన వద్దనున్న రూ.500లు సుల్తాన్కు ఇచ్చాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు
తెగిపడి గేదె మృతి
మనుబోలు: విద్యుదాఘాతానికి గురై గేదె మృతిచెందిన ఘటన మండలంలోని కొండూరుసత్రం పొలాల్లో గురువారం జరిగింది. వర్షాలు, ఈదురుగాలులకు పొలాల్లో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. తీగలు తెగి అడ్డదిడ్డంగా పొలంలో పడిపోయాయి. యళ్లంబాక నందకుమార్ అనే రైతుకు చెందిన గేదె అటుగా వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై చనిపోయింది. దీంతో సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు చెప్పారు. బాధిత రైతును ఆదుకోవాలని ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ కోరారు.
రాళ్లపాడు ప్రాజెక్ట్కు
వరద ప్రవాహం
లింగసముద్రం: వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్ట్లో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 16.5 అడుగులకు చేరింది. ఉప్పుటేరు, పిల్లాపేరుల నుంచి 1,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్ట్కు చేరుతున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయకట్టుకు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని డీఈ చెప్పారు.
ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది
వేధింపులు
● పురుగు మందు తాగిన వ్యక్తి
● చికిత్స పొందుతూ మృతి
మనుబోలు: ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. మండలంలోని పిడూరుమిట్టకు చెందిన ఈగా సాయి (32) ప్రైవేట్ ఫైనాన్స్లో ఇల్లు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల ఆ సిబ్బంది నగదు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 14వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి నెల్లూరులోని ప్రభుత్వత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.
1,580 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు


