
డీసీపల్లిలో 460 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి వేలం కేంద్రంలో మంగళవారం 460 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ తెలిపారు. వేలానికి 706 బేళ్లు రాగా 460 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 58431.5 కిలోల పొగాకును విక్రయించగా రూ.14903359.30 వ్యాపారం జరిగింది. కిలో కు గరిష్ట ధర రూ.280 కాగా కనిష్ట ధర రూ.210 లభించింది. సగటు ధర రూ.255.06 నమోదైంది. వేలంలో 13 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
పొదలకూరు పంచాయతీ
కార్యదర్శి సస్పెన్షన్
నెల్లూరు (పొగతోట): కోర్టుకు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పుదారి పట్టించే విధంగా సమాచారం ఇచ్చిన పొదలకూరు పంచాయతీ కార్యదర్శి వి.శీనయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఓ శ్రీధర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొదలకూరు పంచాయతీలో భూముల విషయాలకు సంబంధించి కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా విధుల్లో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో స్పందించిన కలెక్టర్ సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
చెక్ పవర్ రద్దు
నెల్లూరు (పొగతోట): వింజమూరు మండలం కాటేపల్లి సర్పంచ్ విజయలక్ష్మమ్మ నిధుల దుర్వినియోగానికి సంబంధించి చెక్ పవర్ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీఓ శ్రీధర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు రీజినల్ పంచాయతీ అధికారి విచారణ చేశారు. విచారణలో సాధారణ నిధులు రూ.2,49,311 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,29,519 మొత్తం రూ.4,78,830 దుర్వినియోగం అయినట్లు తేలింది. వీటితోపాటు రూ.13,58,583 నిధులు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారని, అవి కాకుండా రూ.14,87,482 నిధులు గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి సరెండర్ చేసుకోవాల్సిన పరిస్థితి సర్పంచ్ కల్పించారన్నారు. వీటన్నింటికి సర్పంచ్ బాధ్యులు కావడంతో చెక్ పవర్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
నేడు సోమశిల నుంచి
నీటి విడుదలకు సన్నాహాలు
సోమశిల: జిల్లాలో ఖరీఫ్ (రెండో పంట) సాగుకు అవసరమైన నీటి విడుదలపై ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం నీరు విడుదల చేస్తామని జలాశయం అధికారులు మంగళవారం తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రాజెక్ట్ కమిటి చైర్మన్ వేలూరి కేశవ సోమశిల జలాశయం వద్ద సాగునీటిని విడుదల చేస్తారని, నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని అధికారులు తెలిపారు. వాస్తవానికి సోమవారమే నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే సోమశిల అధికారులకు నీటి విడుదలకు సంబంధించి ఇండెంట్ ఇవ్వకపోవడం, మంత్రి ఆనం అందుబాబులో లేకపోవడంతో రెండు రోజుల ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
నల్ల మాస్క్లు ధరించి
మౌన నిరసన
నెల్లూరు (అర్బన్): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని సీహెచ్ఓలు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో చేస్తున్న సమ్మె మంగళవారానికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీహెచ్ఓలు ముఖానికి నల్ల మాస్క్లు ధరించి మౌనంగా నిరసన తెలిపారు. అనంతరం సీహెచ్ఓల అసోసియేషన్ భానుమహేష్ మాట్లాడుతూ తాము న్యాయమైన సమస్యలు తీర్చాలని అడిగితే ప్రభుత్వంలోని పెద్దలు మీరు బాండ్ రాసిచ్చారు. జాగ్రత్త అంటూ తమను హెచ్చరించడం న్యాయం కాదన్నారు. బాండ్ అంటే ఉద్యోగానికి కనీస భద్రత ఉండాలన్నారు. భయం కాదన్నా రు. తమ నోరు నొక్కుతూ ఇన్సెంటీవ్స్ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. పెండింగ్ బకాయిలు, విలేజ్ హెల్త్ క్లినిక్ అద్దెలు తక్షణమే విడు దల చేయాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి మాట్లాడకపోతే శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ ఆదిల్ , కార్యదర్శి రెబకా, సౌమ్య , సుగుణ తదితరులు పాల్గొన్నారు.