
సైదాపురం అక్రమాలపై సినిమా తీయొచ్చు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): సైదాపురం అక్రమాలపై సినిమా తీయొచ్చని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమాలు, అన్యాయాలు అధికమయ్యాయన్నారు. దీనిపై కేసులు పెడితే పోలీస్ స్టేషన్లోనే విచారణలు, తీర్పులు జరుగుతున్నాయన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టిన కూటమి నేతలు ఓడిపోయారన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు లాక్కోవడం, ఇసుక కనిపిస్తే దోచుకోవడం చేస్తున్నారన్నారు. కలువాయి మండలం తెలుగు రాయపురం, రాజుపాలెం వద్ద అక్రమంగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి రోడ్లు వేసి ఇసుక తరలిస్తూనే ఉన్నారన్నారు. అధికారులకు చెబితే తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడం తప్ప చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇసుక మొత్తం బెంగళూరుకు తరలిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకం పరాకాష్టకు చేరిందన్నారు. సంపద సృష్టి పేరుతో స్కాంలు చేస్తున్నారని విమర్శించారు. నాలుగు నెలల ముందు స్థాపించిన ఫిని క్వార్ట్జ్ కంపెనీ ఒక్కటే క్వార్ట్జ్ ఖనిజం మొత్తం ఎగుమతులు చేస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వున్న కంపెనీలు మాత్రం మూత బడిపోయాయని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఈ కంపెనీ అక్రమ వ్యవహారాలు అన్ని బయటకు తీస్తాం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నట్టు, అడవుల్లో కూడా అక్రమ మైనింగ్ చేస్తుంటే మాట్లాడరా? కాకినాడలో సీజ్ ద షిప్ అన్న పవన్ సైదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ అక్రమాలపై కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అమరావతి రాజధాని అనేది పెద్ద డ్రామా అన్నారు. కూటమి ప్రభుత్వం మరో రెండేళ్లు మాత్రం అధికారంలో ఉంటుందని, 2027 లో జమిలి ఎన్నికలు వస్తాయని, వైఎస్సార్సీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ సైదాపురం మండల కన్వీనర్ మన్నారు రవి, నాయకులు ప్రభాకర్రెడ్డి, రాపూరు మండల కన్వీనర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వానిది దోపిడీ పాలన వెంకటగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జి రాంకుమార్రెడ్డి