T20 WC 2022 ENG VS SL: మరో రసవత్తర సమరం.. సెమీస్‌కు ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాకు శృంగభంగం

T20 WC 2022: England Beat Sri Lanka By 5 Wickets And Enters Into Semi Finals - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో గ్రూప్‌-1 సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌ తొలి జట్టుగా సెమీస్‌కు చేరుకోగా.. ఇవాళ (నవంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపుతో ఇంగ్లండ్‌ రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే సెమీస్‌కు చేరాలని భావించిన ఆసీస్‌.. ఇంగ్లండ్‌ గెలవడంతో సూపర్‌-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.   

కాగా, ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు కుశాల్‌ మెండిస్‌ (18), భానుక రాజపక్ష (22) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కర్రన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌), అలెక్స్‌ హేల్స్‌ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్‌) ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్‌  స్టోక్స్‌ (36 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఇంగ్లండ్‌.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఇంగ్లండ్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు. 
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top