స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా | Smriti Mandhana Creates History, Becomes First Player In The World | Sakshi
Sakshi News home page

స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా

Dec 20 2024 8:29 PM | Updated on Dec 20 2024 8:29 PM

Smriti Mandhana Creates History, Becomes First Player In The World

భారత మహిళా స్టార్‌ క్రికెటర్ స్మృతి మంధాన త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తోంది. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌లో అద‌ర‌గొట్టిన మంధాన.. స్వదేశంలో వెస్టిండీస్ మ‌హిళ‌ల జ‌ట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అదే దూకుడు క‌న‌బ‌రిచింది. 

తొలి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచ‌రీల‌తో మెరిసిన మంధాన‌.. గురువారం జ‌రిగిన ఆఖ‌రి టీ20లోనూ త‌న బ్యాట్‌కు ప‌నిచెప్పింది. ఈ మ్యాచ్‌లో స్మృతి విధ్వంసం సృష్టించింది.  కేవలం 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

మంధాన సాధించిన రికార్డులు ఇవే..
👉మహిళా క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో 30 సార్లు ఏభైకి పైగా ప‌రుగులు సాధించింది. ఇంత‌కుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ వెట‌ర‌న్ సుజీ బేట్స్(29) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బేట్స్ ఆల్‌టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది.

అత్య‌ధిక పిఫ్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన ప్లేయ‌ర్లు వీరే..
స్మృతి మంధాన (భార‌త్‌) -30
సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 29
బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 25
స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్‌)- 22
సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 22

👉అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్‌గా సైతం మంధాన రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 21 టీ20 ఇన్నింగ్స్‌ల‌లో స్మృతి 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్లు (720 పరుగులు) పేరిట ఉండేది. 
 

Advertisement
 
Advertisement
Advertisement