ఐపీఎల్-2026 సీజన్ మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్లో వారం రోజల పాటు గ్యాప్ రావడంతో ఆర్సీబీ తమ ఆటగాళ్లను విహారయాత్ర కోసం మాల్దీవులకు పంపింది. టోర్నమెంట్ కీలక దశ ప్రారంభమయ్యే ముందు తమ ప్లేయర్లను మానసిక ఉల్లాసంగా ఉంచేందుకు ఆర్సీబీ మేనెజ్మెంట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆ జట్టు స్టార్ పేసర్ జాకబ్ డఫీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. రజత్ పాటిదార్ సేన ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఆరింట విజయం సాధించింది.
ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది. అయితే అహ్మదాబాద్ వేదికగా తాము ఆడిన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మే 7న లక్నో సూపర్ జెయింట్స్తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది.
విరాట్ కోహ్లి, పడిక్కల్, పాటిదార్ వంటి స్టార్ బ్యాటర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ దుమ్ములేపుతున్నాడు. బెంగళూరు జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ పటిష్టంగా ఉంది. కాబట్టి మరోసారి ఆర్సీబీ టైటిల్ సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.
చదవండి: అంతా అయిపోయింది.. మాకేది కలిసి రాలేదు: హార్దిక్ పాండ్యా


