
Photo Courtesy: BCCI
గెలుపు జోష్లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా చేసిన తప్పిదానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల మేర ఫైన్ వేసింది.
ఐపీఎల్-2025 (IPL 2025)లో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. చెన్నైతో బుధవారం నాటి మ్యాచ్లో గెలిచి ఈ సీజన్లో ఆరో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ పంజాబ్కు ఈ ఎడిషన్లో పదో మ్యాచ్.
చహల్ మాయాజాలం
ఇందులో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన పంజాబ్.. సీఎస్కేను 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ చేసింది. చెన్నై బ్యాటర్లలో సామ్ కరన్ (88), డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించగా.. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
హ్యాట్రిక్ నమోదు చేసిన చహల్.. మొత్తంగా మూడు ఓవర్లలో కేవలం 32 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అర్ష్దీప్ సింగ్, మారోక యాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
నాలుగు వికెట్ల తేడాతో జయభేరి
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఆకట్టుకున్న పంజాబ్.. చెన్నై బౌలర్ల విజృంభణతో ఆఖరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (23), ప్రభ్సిమ్రన్ సింగ్ (54) రాణించగా.. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఆఖర్లో శశాంక్ సింగ్ (12 బంతుల్లో 23) వేగంగా ఆడగా.. 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పంజాబ్ 196 పరుగులు సాధించింది. చెన్నైపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
అయితే, ఈ మ్యాచ్లో పంజాబ్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్లో ఇది తొలి తప్పిదం కాబట్టి.. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ మేర ఫైన్తో సరిపెట్టినట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.
ఐదుసార్లు చెన్నైని చెపాక్లో ఓడించి
మరోవైపు.. పంజాబ్ చేతిలో ఓటమితో చెన్నై ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా సీఎస్కే సొంత మైదానం చెపాక్లో ఆ జట్టును అత్యధిక సార్లు ఓడించిన జట్టుగా పంజాబ్ రికార్డులకెక్కింది. ఐదుసార్లు చెన్నైని చెపాక్లో ఓడించి ముంబై రికార్డును సమం చేసింది. అంతకుముందు ముంబై ఇండియన్స్ తొమ్మిది మ్యాచ్లలో ఇదే వేదికపై ధోని సేనను ఓడించగా.. ఇప్పుడు పంజాబ్ కూడా ఆ ఘనత సాధించింది.
చదవండి: #Glenn Maxwell: ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..
Hat-trick 👌
Powerful start with the bat 🔥
Captain's knock 🫡
The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤
Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025