స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న చారిత్రక సిరీస్ను పాక్ మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కరాచీ వేదికగా నిన్న (మే 9) జరిగిన మూడో వన్డేలో పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా, సదాఫ్ షమాస్ మరోసారి చెలరేగి పాక్కు తిరుగులేని విజయాన్నందించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెలిస్ (51), బిలవ్డ్ బిజా (73) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో జిమును (23), కెప్టెన్ సిబండ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో తస్మియా రుబాబ్ 3, అరూబ్ షా, అయేషా జాఫర్ తలో 2, మొమినా రియాసత్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని పాక్ 31.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు గల్ ఫిరోజా, సదాఫ్ షమాస్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగి పాక్ను గెలిపించారు. ఫెరోజా ఈ సిరీస్లో రెండో సెంచరీతో (106 నాటౌట్) కదంతొక్కగా.. షమాస్ (90) ఈ సిరీస్లో రెండో సెంచరీని తృటిలో చేజార్చుకుంది.
కాగా, ఈ సిరీస్లో పాక్ తొలి మ్యాచ్ నుంచే పసికూన జింబాబ్వేపై చెలరేగిపోతుంది. మూడు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ముఖ్యంగా ఓపెనర్లు సదాఫ్, ఫెరోజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సదాఫ్ తొలి మ్యాచ్లో 98, రెండో మ్యాచ్లో 101, మూడో మ్యాచ్లో 90 పరుగులతో చెలరేగగా.. ఫెరోజా తొలి మ్యాచ్లో 50, రెండో వన్డేలో 100, మూడో వన్డేలో అజేయ శతకంతో విరుచుకుపడింది.


