IND Vs AUS: ముందే భయపడ్డారు; పిచ్‌పై ఉన్న శ్రద్ద ఆటపై పెడితే బాగుండు

BGT 2023: Reasons Why Australia Failure In 1st Test Vs IND - Sakshi

IND VS AUS 1st Test Day-3 Analaysis.. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు ముగిసింది. బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో మట్టికరిపించిన భారత్‌ నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఐదు రోజులు జరుగుతుందనుకున్న మ్యాచ్‌ కాస్త రెండున్నర రోజుల్లోనే పూర్తయింది. వాస్తవానికి ఇది రెండున్నర రోజుల్లో ముగియాల్సింది కాదు. ఆస్ట్రేలియానే కావాలని కోరి తెచ్చుకున్న తంటా అనుకోవచ్చు. కనీస పోరాటం చేయకుండా టీమిండియా స్పిన్నర్ల ఉచ్చులో పడిన ఆస్ట్రేలియాను తిట్టాలో.. వారి ఆటతీరు చూసి ఆశ్చర్యపోవాలో అర్థం కావడం లేదు. 

ఎందుకంటే ఈసారి ఆస్ట్రేలియా మన గడ్డపై అడుగుపెట్టాల్సిన సమయం కన్నా వారం ముందే వచ్చేసింది. ఈసారి ఎలాగైనా సిరీస్‌ను గెలుస్తామని కంకణం కట్టుకున్నట్లు చెప్పిన మాటలు చూసి ఆసీస్‌లో కాన్ఫిడెంట్‌ లెవెల్స్‌ బాగున్నాయని అంతా అనుకున్నారు. టీమిండియా కంటే ముందే ప్రాక్టీస్‌ ఆరంభించారు. దానికోసం కర్నాటక స్టేడియంలో అశ్విన్‌ను పోలిన బౌలర్‌ మహీష్‌ పితియాతో ఓవర్లకు ఓవర్లు బౌలింగ్‌ చేయించుకొని మరీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. 

అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఆసీస్‌ ఆటగాళ్లు చేసిన అతి.. జట్టు కొంపముంచింది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని ముందు నుంచి చెబుతూనే వచ్చారు. అన్నట్లుగానే మ్యాచ్‌లో స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపారు. అలాగని కేవలం టీమిండియా బౌలర్లకే అనుకూలించిందా అంటే అదీ లేదు. ఆసీస్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తన అరంగేట్రం టెస్టులోనే ఏడు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. నాథన్‌ లియోన్‌ కూడా కొద్దిమేర ప్రభావం చూపించాడు.

మ్యాచ్‌లో ఇరుజట్ల స్పిన్నర్లు కలిపి 23 వికెట్లు పడగొట్టారు. ఇందులో జడ్డూ ఖాతాలో ఏడు వికెట్లు ఉండగా.. అశ్విన్‌ ఖాతాలో 8 వికెట్లు ఉన్నాయి. ఇక ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మర్ఫీవే ఏడు వికెట్లు ఉండగా.. లియోన్‌కు ఒక వికెట్‌ దక్కింది. అయినా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ ముగియడం వెనుక ప్రధాన కారణం.. ఆస్ట్రేలియా భయపడడం ఒకటయితే.. రెండు బ్యాటింగ్‌ వైఫల్యం.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు స్మిత్‌, వార్నర్‌లు వచ్చి పిచ్‌ను అదే పనిగా పరిశీలించడం.. క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా 'డాక్టర్డ్‌ పిచ్‌(Doctored Pitch)' అని పేర్కొనడం.. ఆసీస్‌ మీడియా మరింత ముందుకెళ్లి నాగ్‌పూర్‌ పిచ్‌పై పలు కథనాలు ప్రచురించడం ఆసక్తి కలిగించింది. ఇవన్నీ చేసిందంటే ఆసీస్‌ తొలి టెస్టుకు ముందే భయపడినట్లు కదా. పిచ్‌పై పెట్టిన శ్రద్ధ ఆస్ట్రేలియా ఆటపై పెట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. 

అశ్విన్‌ను ఈసారి చీల్చి చెండాడుతాం.. జడ్డూ బౌలింగ్‌ను ఆడుకుంటాం అని శపథాలు పలికిన ఆసీస్‌ బ్యాటర్లు ఊసురుమనిపించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం అర్థశతకం మార్క్‌ను అందుకోలేకపోయారు. అశ్విన్‌ను పోలిన బౌలర్‌తో బౌలింగ్‌ అయితే చేయించారు తప్ప ప్రాక్టీస్‌ మాత్రం పెద్దగా ఏం చేయలేదని ఇవాళ ఆసీస్‌ ఆటగాళ్ల ప్రదర్శనతో నిరూపితమైంది. కనీసం రెండో టెస్టుకైనా ఆస్ట్రేలియా ఇలాంటి పిచ్చి ఆరోపణలు పక్కనబెట్టి ఆటపై దృష్టి పెడితే బాగుంటుందని పలువురు క్రీడా పండితులు పేర్కొన్నారు.

చదవండి: IND VS AUS 1st Test: కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లను అధిగమించిన షమీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top