భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది.
ఈ రెండు మ్యాచ్లు జూన్ 26,28వ తేదిల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సిరీస్ టీమిండియా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో లేదు.
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది.
జూలై 1- 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీసీసీఐ ఈ పర్యటనను ఖరారు చేసింది. ఆ తర్వాత భారత జట్టు అక్కడ నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనుంది. భారత్, ఐర్లాండ్ జట్లు చివరిసారిగా టీ20 ప్రపంచకప్లో తలపడ్డాయి.
చదవండి: IPl 2026: 'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు'


