ఐపీఎల్-2026 సీజన్లో సత్తా చాటేందుకు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సిద్దమవుతున్నాడు. గత సీజన్లో తన అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని అకర్షించిన ఈ బిహార్ ఆటగాడు.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఇప్పటికే రాయల్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరిన 14 ఏళ్ల సూర్యవంశీ .. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది వైభవ్పై భారీ అంచనాలతో పాటు ఒత్తడి కూడా ఉంటుందని పరాగ్ తెలిపాడు.
వైభవ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అతడిపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కెప్టెన్గా ఒక్క విషయం అతడికి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఒత్తిడిని యశస్వి జైస్వాల్కు వదిలేయమని చెబుతా. ఎందుకంటే జైశ్వాల్కు అనుభవం ఎక్కువగా ఉంది. ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా జైశూ వద్ద ఉంది.
కాబట్టి వైభవ్ క్రీజులోకి వెళ్లి తన సహజ సిద్ధమైన ఆటను ఆడితే చాలు. బయట విషయాలను అతడు పట్టించుకోకూడదు. అతడి దృష్టింతా కేవలం ఆటపైనే ఉండాలి. అందుకే అతడిని మీడియా దృష్టికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరుకావద్దని, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడవద్దని చెబుతాను అని పరాగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2025 సీజన్లో వైభవ్ దుమ్ములేపాడు. కేవలం 7 మ్యాచ్లలో 206.56 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు.
చదవండి: IPL 2026: లైంగిక ఆరోపణలు.. స్టార్ ప్లేయర్పై వేటు వేసిన ఆర్సీబీ!?


