● ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు పోరాటం ● నిరుద్యోగ యువతతో మాజీ మంత్రి హరీశ్
సిద్దిపేటజోన్: ‘ఆందోళన వద్దు.. మీకు అండగా ఉంటా.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు ఊరుకునేది లేదు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ గురించి వివరించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడం లేదన్నారు. అనంతరం నిరుద్యోగ యువతతో కలిసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డీఎస్సీ వేయాలని, ఉద్యోగాల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో చేపడుతున్న యాత్రపై అడిగి తెలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. జిల్లాకు వచ్చిన ప్రతినిధులను అభినందించారు.
విలీనం అయ్యాకే రంగధాంపల్లి అభివృద్ధి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలోని రంగధాంపల్లి మున్సిపాలిటీలో కలిశాకే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రంగధాంపల్లిలో శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయం ప్రాంగణం లో నిర్మించిన అన్న ప్రసాద భవనాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం హనుమాన్ మాలధారులతో కలిసి భోజనం(భిక్ష) చేశారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట అన్నదానాలకు, ఆధ్యాత్మికతకు నెలవుగా మారిందన్నారు. హనుమాన్ దీక్షకు, భిక్ష కు బీజం వేసింది మన సిద్దిపేటనేన్నారు.


