పొత్తు పొడిచేనా?
చేర్యాలలో బీఆర్ఎస్ – సీపీఎం మధ్య కుదిరిన సయోధ్య
మిగతా చోట్ల కొనసాగుతున్న చర్చలు
పలు వార్డుల్లో సొంతంగా పోటీకి సై అంటున్న వామపక్షాలు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ వైపు నామినేషన్ల సందడి నెలకొనగా.. మరోవైపు పొత్తులకు సంబంధించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీల నుంచి ఆయా వార్డుల కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న వారందరూ నామినేషన్ను దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటికే ఆయా పార్టీలు పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని వార్డులకు అభ్యర్థులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రకటించాల్సి ఉంది. – సాక్షి, సిద్దిపేట
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్– సీపీఎం పొత్తుతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా అందులో ఒక వార్డును సీపీఎంకు కేటాయించారు. 3వ వార్డును ముస్త్యాల లావణ్యకు సీపీఎం కేటాయించారు. గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీలలో సీట్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. గజ్వేల్లో ఒకటి, దుబ్బాకలో రెండు వార్డులు అడుగుతున్నతున్నట్లు సమాచారం. ఈ రెండు మున్సిపాలిటీలలో పొత్తు కుదరకపోతే సొంతంగానే బరిలోనే దిగుతామని సీపీఎం నేతలు వెల్లడిస్తున్నారు.
కాంగ్రెస్–సీపీఐ చర్చలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. అప్పటి నుంచి వారి మధ్య దోస్తీ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా? ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది. పొత్తు కోసం కాంగ్రెస్, సీపీఐ నాయకులు చర్చలు జరుపుతున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో రెండు నుంచి మూడు వార్డులు అవకాశం ఇవ్వాలని సీపీఐ అడుగుతున్నట్లు సమాచారం. హుస్నాబాద్లో పొత్తులో భాగంగా సీసీఐకి కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి ఆశలకు గండి పడనుంది. సొంతం
గా పోటీ చేస్తారా? పొత్తుతో ముందుకు వెళ్తారా? అనేది శుక్రవారం తేలిపోనుంది.
వామపక్ష వేదికగా..
ఆయా మున్సిపాలిటీలలో సీపీఐ, సీపీఎంలు ఇతర పార్టీలతో పొత్తుకు సంబంధించి చర్చలు ఫలించకపోతే వామపక్ష వేదికగా పోటీ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. సీపీఎం, సీపీఐలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని పోటీ చేయాలనుకునే పలువురు అభ్యర్థులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వామపక్షాల తమ ఓటు బ్యాంక్ చాటాలని అనుకున్నట్లు సమాచారం.ఈ ఎన్నికల్లో ఒక్క చేర్యాల మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్–సీపీఎం పొత్తు కుదరగా మిగతా వాటిలో ఎలా ఉంటుందో చూడాలి.
చేర్యాలలో బీఆర్ఎస్కు 11.. సీపీఎంకు 1
చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని 12 వార్డుల్లో 11 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఒక వార్డును సీపీఎంకు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. 11 వార్డుల్లో ఆరు వార్డులకు ఇదివరకే అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 5 వార్డులకు అభ్యర్థులుగా 2వ వార్డు కమలాపురం గీతాంజలి, 5వ వార్డు తొండెంగల రాజే శ్, 7వ వార్డు మేర్గు లక్ష్మణ్, 11వ వార్డు ఎండీ ఇజాజ్ అహ్మద్, 12వ వార్డు శివగారి భబితలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. మిగిలిన 3వ వార్డును సీపీఎంకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
కొలిక్కిరాని కాంగ్రెస్ – సీపీఐ దోస్తీ


