
పిల్లల బంగారు భవిష్యత్తే ముఖ్యం
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● కలెక్టరేట్లో అధికారిక దత్తత
సిద్దిపేటరూరల్: అధికారికంగా దత్తత తీసుకున్న దంపతులు పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురి దంపతులకు చిన్నారులను అదనపు కలెక్టర్ మంగళవారం అధికారికంగా దత్తత అందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలని బాగా చదివించాలని, వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలన్నారు. పిల్లల బంగారు భవిషత్కు బాటలు వేసే పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే సిద్దిపేటలోని శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తద్వారా ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని, అదే విధంగా ఎవరైనా అక్రమ దత్తత తీసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎ.లక్ష్మీకాంత్ రెడ్డి, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, శిశు గృహ సోషల్ వర్కర్ రాజారామ్, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన వస్తువులే సరఫరా చేయాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు సరఫరా చేసే వస్తువుల విషయంలో నాణ్యమైన వస్తువులనే సరఫరా చేయాలని, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందించనున్న వస్తువుల టెండర్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మటన్, చికెన్, ఇతర అహార వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గడువుదాటిన వస్తువులు టెండర్దారులు వసతి గృహాలకు సరఫరా చేయరాదని, ఒక వేళ చేసినా వసతి గృహ నిర్వాహకులు తిప్పి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టెండర్దారులు పాల్గొన్నారు.