
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
● సమస్య ఉన్నవారెవరూ అధైర్యపడొద్దు ● కలెక్టర్ మనుచౌదరి
దుబ్బాక: ‘భూ సమస్యలు ఉన్నవారు అధైర్యపడొద్దు.. భూ భారతి చట్టంతో అన్ని సమస్యలకూ శాశ్వత పరిష్కారం లభిస్తుంది’ అని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అప్పనపల్లిలో భూ భారతి అవగాహన సదస్సును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులో అర్జీలు పెట్టుకోవాలన్నారు. అధికారులకు మీ సమస్య వివరిస్తే సమస్యను పరిష్కారం చేస్తారన్నారు. జిల్లాలో ఈ నెల 20 వరకు జరిగే సదస్సుల్లో భూ సమస్య ఉన్న వారు పాల్గోనాలన్నారు. ఈ సందర్భంగా రైతుల భూ సమస్యలు ఒపిగ్గా విన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి..
సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలనే చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వైద్య విభాగాల రూంలను, సంబంధిత వైద్య పరికరాలను పరిశీలించారు. వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్కారు ఆస్పత్రుల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని, సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్, ఆయా విభాగాల డాక్టర్లు తదితరులు ఉన్నారు.