
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
తొగుట(దుబ్బాక): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆదివారం మండలంలోని పెద్ద మాసాన్పల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రంతో పాటు నాయకులను ఎంపీ సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహులు, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.
ముత్యాల పోచమ్మ ఉత్సవాల్లో..
దుబ్బాక: దైవనామస్మరణతోనే సుఖసంతోషాలతో ఉంటామని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. దుబ్బాక పట్టణంలో బాబు జగ్జీవన్రామ్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న ముత్యాల పోచమ్మ ఉత్సవాల్లో ఆదివారం ఎంపీ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్,సంఘం నాయకులు పాల్గొన్నారు.
జాతీయ యోగా జడ్జిగా సంధ్య
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పంజాబ్లో నిర్వహించిన నేషనల్ జడ్జి ట్రైనింగ్లో జిల్లా కేంద్రానికి చెందిన తోట సంధ్య పాల్గొని అర్హత సాధించినట్లు యోగాసన భారత్ ప్రధాన కార్యదర్శి జయదీప్ ఆర్య ఆదివారం తెలిపారు. జాతీయ యోగా జడ్జిగా పూర్తి చేసుకున్న తోటసంధ్యను రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్, జిల్లా అధ్యక్షుడు తోట అశోక్, ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
డీబీఎఫ్ జిల్లా
కార్యదర్శిగా వేణు
గజ్వేల్: పట్టణానికి చెందిన బ్యాగరి వేణు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సిద్దిపేటలో జరిగిన డీబీఎఫ్ మహాసభల్లో వేణు ఎన్నికను ఖరారు చేశారు. తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడంపై ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఇతర నాయకులకు వేణు కృతజ్ఞతలు తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం