
7 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని కరీంనగర్ రీజినల్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశాడు. కారుణ్య నియామకాలు చేపట్టిన వారిని రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్ధకు అప్పజెప్పాలన్నారు.
న్యాయవాదుల సహకార
సంఘం డైరెక్టర్గా సంజీవరెడ్డి
దుబ్బాక: న్యాయవాదుల పరస్పర సహకార సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్గా దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మరిపెద్ది సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్గా ఎన్నుకోవడంపై సహచర న్యాయవాదులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తానని తెలిపారు.
ఫెయిలైన విద్యార్థులకు
ప్రత్యేక తరగతులు
డీఐఈఓ రవీందర్రెడ్డి
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సిద్దిపేట డీఐఈఓ రవీందర్రెడ్డి శనివారం సందర్శించారు. అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాలకు వెళ్లి 10 పాసైన విద్యార్థులను, తల్లిదండ్రులను కలువాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, సరిత, ప్రవీణ్రెడ్డి, సంజీవ్, శేషశయన తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో
విధులు నిర్వర్తించాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): క్రమ శిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతోపాటు విధులు నిర్వర్తించాలని ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పెద్దకోడూరు శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని సివిల్, రిజర్వ్ పోలీస్, హోంగార్డు సిబ్బందికి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మతం ముసుగులో
దాడులు చేయొద్దు
ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
చేర్యాల(సిద్దిపేట): దళితులపై మతం ముసుగులో దాడులకు దిగడం సరైనదికాదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండల పరిధిలోని వేచరేణిలో దళిత యువకుడిపై దాడిజరిగిన విషయంమై శనివారం గ్రామానికి వచ్చిన ఆయన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ మతం ముసుగులో దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట దళిత సంఘాల నాయకులు తదితరులున్నారు.

7 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె